పహాడీషరీఫ్, సెప్టెంబర్ 24: మామిడిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటి స్లాబ్ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. వీరు నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ సతీశ్, ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్కు చెందిన సంజీవ్ మామిడిపల్లిలోని మామిడితోటలో నూతన ఇంటి నిర్మాణం చేయిస్తున్నాడు. తన ఇంటి నిర్మాణ పనులను నాగరాజు అనే కాంట్రాక్టర్కు అప్పగించాడు. ఒడిశా రాష్ర్టానికి చెందిన జగదీశ్ బీడిక (49), తన సోదరుడితో కలిసి నిర్మాణం జరుగుతున్న చోటనే గుడిసె వేసుకుని ఉంటున్నాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన తిలక్ దారి(33) రెడిమిక్స్లో పనిచేస్తున్నాడు. ఇంటి మొదటి అంతస్తు అంతస్తు స్లాబ్ పనులు పూర్తయ్యాయి.
ఆదివారం ఉదయం హయత్నగర్ నుంచి కొంతమంది రోజువారీ కూలీలను తీసుకొచ్చి రెండు ఫ్లోర్లో సదరు కాంట్రాక్టర్ స్లాబ్ వేయిస్తున్నాడు. ఈ క్రమంలో రెండో స్లాబ్కు వేసిన పిల్లర్లు గట్టిగా లేకపోవడంతో.. పిల్లర్లు విరిగిపోయి స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. తీవ్రగాయాలపాలైన బగదీశ్ బీడీక, తిలక్ దారి ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. మరో నలుగురు కూలీలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం నిమ్స్ దవాఖానకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడు జగదీశ్ సోదరుడు దిలీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.