సిటీబ్యూరో, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో ఆర్టీసీ కార్గో సేవలు రోజు రోజుకు ప్రజాదరణ చూరగొంటున్నాయి. కార్గో సేవలు మొదలైన అతి తక్కువ కాలంలోనే ప్రైవేటు రవాణా సేవలతో పోటీ పడుతూ ప్రజల ఆదరణ పొందుతున్నాయి. గత ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.34.97 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ అధికార యంత్రాంగం గురువారం ప్రకటించింది. అందులో పార్సిల్ సేవల ద్వారా రూ.22.30 కోట్లు, బల్క్ పార్సిల్ సేవల ద్వారా రూ.12.67 కోట్లు రాబడి వచ్చిందన్నారు. ఇది రాష్ట్ర స్థాయిలో వచ్చిన ఆదాయంలో సగానికి పైగా ఉన్నట్టు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కార్గో పార్సిల్ బుకింగ్ సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 18.65 లక్షల పార్సిళ్లు బుక్ అయ్యాయి.