బంజారాహిల్స్, అక్టోబర్ 19: సమాజంలో అట్టడుగున ఉన్న దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని అడ్డుకున్న బీజేపీకి హుజూరాబాద్ ప్రజలు గుణపాఠం చెబుతారని టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులకు తీరని ద్రోహం చేసే విధానాలను ఈటల రాజేందర్ అవలంబిస్తున్నారని అన్నారు. దళితబంధును అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హుజూరాబాద్లో బీజేపీని భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నా ఈటల రాజేందర్ బీజేపీలో చేరి దళిత ద్రోహిగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బరిగెల వెంకటస్వామి, టీఎమ్మార్పీఎస్ యువసేన అధ్యక్షుడు నల్ల శివ మాదిగ పాల్గొన్నారు.