సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో నిర్మాణ రంగం జోరుమీదున్నది. కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా నూతన ఇండ్ల నిర్మాణాలపై ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. భవన, లే అవుట్ నిర్మాణాలకు అవసరమైన అనుమతుల కోసం జీహెచ్ఎంసీకి పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కరోనా తీవ్రంగా ఉన్న ఏప్రిల్, మే నెలలోనూ వేల సంఖ్యలో ఇండ్లకు అనుమతులు ఇచ్చిన అధికారులు గడిచిన నెలలో సరాసరిగా 3500 మేర దరఖాస్తులు రాగా.. 3300లకు పైగా అనుమతులు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఎల్బీనగర్, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో ఎక్కువ శాతం దరఖాస్తులు రాగా.. కూకట్పల్లి, చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లలో తక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్ బీ పాస్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ పర్మిషన్ల ద్వారా నెలకు జీహెచ్ఎంసీ రూ. 31కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. కాగా ఈ నెలలో శ్రావణమాసం పురస్కరించుకొని నూతన ఇండ్ల నిర్మాణ పనులు ఎక్కువగా చేపడుతున్నారని, పర్మిషన్లకు పోటీ ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
75 గజాల్లోపు ఇండ్లకు రూ.1 కే నిమిషాల్లో అనుమతి పొందుతున్నారు. ప్రధానంగా 76 నుంచి 600 చదరపు గజాల వరకు స్థలంలో 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే నివాస భవనాలకు స్వీయ ధ్రువీకరణతో అనుమతులు పొందుతున్నారు. స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు, భవనం ప్లాన్ తదితర వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వెంటనే వీరికి (ఇన్స్టంట్ అఫ్రూవల్) 21 రోజుల వ్యవధిలోనే అనుమతులు లభిస్తున్నాయి. ఇలా స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతి పొందిన స్థలాలను పరిశీలించేందుకు జోనల్ స్థాయిలో ప్రత్యేకంగా నియమించిన టాస్క్ఫోర్స్ కమిటీ పోస్ట్ వెరిఫికేషన్ జరుపుతున్నది. అయితే నిర్మాణ దారులు ముందుగా పేర్కొన్న ప్లాన్కు తగ్గట్టుగా నిర్మాణం చేపట్టకపోవడం, అనుమతి లేకుండా అదనపు అంతస్తుల నిర్మాణం, సెట్బ్యాక్ నిబంధనలు పాటించకపోవడం లాంటి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇటువంటి వాటిపై స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలు ఉక్కుపాదం మోపుతున్నాయి.