సిటీబ్యూరో, జులై 21(నమస్తే తెలంగాణ): కోట్ల రూపాయల విలువజేసే కార్లు అవి. అత్యంత సంపన్నులు మాత్రమే కొనుగోలు చేస్తారు. వాటిని సరదాగా రేసింగ్ పోటీలకు ఉపయోగిస్తారు. రయ్ రయ్మంటూ రోడ్లపై దూసుకుపోయే ఆ కార్లకు మాత్రం వాహన పన్ను కట్టకుండా కొందరు బిగ్షాట్లు పిసినారి బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. నగరంలో గుట్టుగా రేసింగ్ పోటీలు నిర్వహించి కోట్ల రూపాయలు చేతులు మార్చుకుంటున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి కేంద్రీకరించడంతో రేసింగ్కు కట్టడి పడింది. ఇటీవల నియోపోలిస్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 4 రేసింగ్ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ కార్ల వివరాలపై రవాణా శాఖ అధికారులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఆ కార్లు ఇతర రాష్ర్టాలకు చెందినవిగా గుర్తించారు. రెండు మహారాష్ట్ర, మరో రెండు పుదిచ్చేరికి చెందిన కార్లుగా ఆర్టీఏ అధికారులు గుర్తించారు. అంతేకాదు.. ఆ కార్ల లైఫ్ ట్యాక్సీ కూడా చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిప్పుతున్నారు. వాటి ఇన్ వాయిస్, రిజిస్ట్రేషన్ ఆధారంగా ఆ కార్లకు సుమారు 1.45కోట్ల రూపాయల వరకు లైఫ్ ట్యాక్సీ చెల్లించాల్సి ఉన్నదని అత్తాపూర్ ఎంవీఐ సురేందర్ రెడ్డి తెలిపారు.
ఆ ఖరీదైన రేసింగ్ కార్లు ఇవే.!
రవాణా శాఖ అధికారులు ఆ కార్లను సీజ్ చేశారు. ఇద్దరు యజమానుల నుంచి వివరాలు సేకరించగా, మరో ఇద్దరు అందుబాటులో లేరు. కార్లలో ఫెరారీ, లాంబోర్గిని, ఆడి, బెంజ్ స్పోర్ట్స్ కార్లు ఉన్నాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. యజమానులకు ఇక్కడి చిరునామా ఉంది.. కానీ వారి బండ్లను మాత్రం మార్చుకోలేదన్నారు. ఇందులో లాంబోర్గినికి 15 లక్షలు, ఆడి 40 లక్షలు, ఫెరారీ స్పోర్ట్స్ 50, బెంజ్ కారు (కొత్తది) 40లక్షల లైఫ్ ట్యాక్సీ చెల్లించాల్సి ఉన్నదని అధికారులు తెలిపారు. ఈ రిపోర్ట్ను పోలీసులకు అందజేసినట్టు అత్తాపూర్ ఆర్టీఏ అధికారులు వివరించారు.
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. పన్ను చెల్లించకుండా వాహనాలు రోడ్డు ఎక్కకూడదు. లైఫ్ ట్యాక్సీ చెల్లించకుండా ఇతర రాష్ర్టాల వాహనాలు నగరంలో తిరుగుతున్నాయి. వాటిపైన ఉన్నతాధికారుల సూచనలతో డ్రైవ్ చేపడుతున్నాం. యజమానులపై కేసులు నమోదు చేస్తున్నాం. వాహన రిజిస్ట్రేషన్ ఆధారంగా ట్యాక్సీ వసూలు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో ట్యాక్సీలు చెల్లించాలి. లేకపోతే వాహనాలను సీజ్ చేయాల్సి ఉంటుంది.
– సురేందర్ రెడ్డి,ఎంవీఐ, అత్తాపూర్ రవాణా కార్యాలయం