Traffic Restrictions | నగరంలోని నెక్లెస్ రోడ్, ట్యాంక్బండ్లో సోమవారం షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5కే, 2.5కే రన్ జరుగనున్నాయి. ఈ క్రమంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు. వీవీ విగ్రహం నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద షాదన్, నిరంకారి భవన్ వైపు మళ్లించనున్నారు. ఇక్బాల్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ను సెక్రెటేరియట్ ఓల్డ్ గేట్ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్పై మళ్లించనున్నట్లు పేర్కొన్నారు.
లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్ మలుపు వద్ద మళ్లించనున్నారు. కవాడిగూడ క్రాస్ రోడ్ నుంచి వచ్చే వాహనాలకు సెయిలింగ్ క్లబ్ వైపునకు వెళ్లేందుకు అనుమతి లేదని, కర్బలా మైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను చిల్డ్రన్స్ పార్క్ వద్ద డీబీఆర్ మిల్స్ వైపు మళ్లించనున్నట్లు తెలిపారు.
డీబీఆర్ మిల్స్ నుంచి వచ్చే వాహనాలను చిల్డ్రన్ పార్క్ వైపునకు అనుమతి లేదని, మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ వద్ద మళ్లించనున్నారు. ట్రాఫిక్ మళ్లింపును దృష్టిలో పెట్టుకొని సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. వాహనదారులు ఆయా మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.