Hyderabad | ఓ హోంగార్డు తన బాధ్యతను మరిచి విధి నిర్వహణలో పరిచయమైన అమ్మాయిని ప్రేమలోకి దింపాడు. తనకు అప్పటికే పెళ్లయ్యి, ముగ్గురు పిల్లలు ఉన్న విషయాన్ని దాచి ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. చివరకు ఈ విషయం రెండో భార్య ఇంట్లో తెలియడంతో.. తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పొంగూరు వాసుదేవరావు (38) హైదరాబాద్ అబిడ్స్లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి ఇప్పటికే వివాహమై.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఇద్దరు కూతుళ్లను తీసుకుని భార్య స్వగ్రామానికి వెళ్లింది. ఏడేళ్ల కుమారుడితో వాసుదేవరావు జగద్గిరిగుట్టలో అద్దెకు ఉంటున్నాడు. ఇటీవల మేడారం జాతరలో విధులు నిర్వహించేందుకు వెళ్లాడు.
మేడారం జాతరలో విధులు నిర్వహించే క్రమంలో తన తల్లి కనిపించడం లేదని ఓ యువతి (25) వాసుదేవరావు కూర్చున్న ట్రాఫిక్ బూత్ను ఆశ్రయించింది. దీంతో గంట వ్యవధిలోనే యువతి తల్లిని కనుగొని అప్పగించాడు. ఇదే అదునుగా చేసుకుని వాసుదేవరావు సదరు యువతితో పరిచయం పెంచుకున్నాడు. కేవలం 20 రోజుల్లోనే ఆమెను ప్రేమలోకి దింపి పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ విషయాన్ని యువతి ఇంట్లో తెలియకుండా కొద్దిరోజులు మేనేజ్ చేశారు. అయితే కూతురు తరచూ బయటకు వెళ్లడం గమనించి ఆమె తండ్రి నిలదీయగా.. వాసుదేవరావును పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. అప్పటికే వాసుదేవరావుకు పెళ్లయ్యి.. ముగ్గురు పిల్లలు ఉన్న విషయాన్ని దాచి రెండో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వాసుదేవరావు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. రెండో పెళ్లి విషయం బయటపడటంతో యువతి కుటుంబసభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరాడు. దీనిపై విచారణ చేపట్టిన బంజారాహిల్స్ పోలీసులు.. సదరు యువతి మేజర్ కావడంతో వాసుదేవరావుతో పంపించేశారు. ఈ రెండో పెళ్లిపై వాసుదేవరావు మొదటి భార్య నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. రెండో పెళ్లి చేసుకున్న వాసుదేవరావుపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.