Hyderabad | హైదరాబాద్ శివారులోని నార్సింగిలో డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి 4 గ్రాముల ఎండీఎంఏ మత్తుపదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలిసింది. దీంతో లావణ్యపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కాగా, లావణ్య టాలీవుడ్ హీరోకు ప్రియురాలు అనే విషయం కూడా ఈ దర్యాప్తులో బయటపడింది.
కోకాపేటలోని ఓ అపార్ట్మెంటులో ఉంటున్న లావణ్య మ్యూజిషియన్గా పనిచేస్తున్నది. మూడు నెలల క్రితం వరలక్ష్మీ టిఫిన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులో లావణ్య పేరు కూడా బయటకొచ్చింది. కానీ అప్పుడు దొరక్కుండా లావణ్య తప్పించుకుంది. దీంతో లావణ్యపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ తీసుకెళ్తుందనే పక్కా సమాచారంతో.. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన లావణ్య ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్ బ్యాగులో నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభించాయి.
ఈ క్రమంలో లావణ్య ను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఉనిత్ రెడ్డి అనే వ్యక్తి డ్రగ్స్ ఇచ్చినట్లుగా తెలిపింది. ఉనిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి ఈ డ్రగ్స్ తీసుకొచ్చినట్లుగా తెలిసింది. కాగా, లావణ్య మ్యూజిషియన్గా పనిచేస్తుండటంతో సినీ ఇండస్ట్రీలోనూ ఈమెకు పరిచయాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. లావణ్య కేవలం డ్రగ్స్ తీసుకుంటుందా? లేదా సినీ ఇండస్ట్రీలో ఎవరికైనా విక్రయిస్తుందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె సెల్ఫోన్ డేటాను సేకరిస్తున్నారు.