సిటీబ్యూరో, జూలై 15(నమస్తే తెలంగాణ): ‘ఇందు గలడు.. అందు లేడంటు సందేహంబు వలదు… ఎందెందు వెతికినా అందందే కలడు..’ అని నారాయణుని గురించి ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపునితో అన్న పలుకులు ఇవి. ఇదే విధంగానే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంగా వాడుకలోకి వచ్చిన ‘కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)’ ఇప్పుడు సర్వాంతర్యామిగా మారింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోనూ తనదైన ముద్రను చూపుతోంది. ఇప్పుడిప్పుడే మొదలైన దాని ప్రభావం మున్ముందు మరింతగా విస్తరించి అన్ని రంగాల్లోనూ తానే సర్వస్వం అన్నట్లుగా మారుతుందనే అభిప్రాయాన్ని ఐటీ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు టెక్నాలజీ మన దైనందిన జీవితంలో విడదీయరానిదిగా మారితే, ఆ టెక్నాలజీల్లో ఒకటిగా పుట్టుకు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏకంగా మనుషుల ప్రమేయాన్ని ప్రశ్నించేలా చేస్తోంది. మనుషులు చేయాల్సిన పనులన్నీ ఎంచక్కా ఏఐ చేసి పెడుతోంది. మున్ముందు ఏఐ భవిష్యత్తును ఏలుతుందని అందరూ భావిస్తున్నారు. బెంగళూరులో ఒక స్టార్టప్ కంపెనీ 90 శాతం ఉద్యోగులను తొలగించి, వాటి స్థానంలో చాట్ జీపీటీ బోట్లతో పనిచేయించుకుంటోందని సమాచారం. అదే విధంగా దుకాణ్ అనే ఒక సంస్థ తమ కస్టమర్ కేర్ విభాగంలోని మెజారిటీ ఉద్యోగుల స్థానంలో ఏఐ చాట్బోట్లతో భర్తీ చేసినట్లు తెలిసింది. ఇలా మనుషుల మనుగడనే ప్రశ్నార్థకం చేసేలా ఏఐ టెక్నాలజీ ప్రపంచంలోకి చొచ్చుకు వచ్చేస్తోంది. ప్రతియేటా జూలై 16న ఏఐ ప్రశంసా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. చాట్ జీపీటీ ఆవిష్కరణతో పాటు దాన్ని పోలిన ఏఐ చాట్బోట్ పదుల సంఖ్యలో రంగప్రవేశం చేయడంతో ఏఐ ప్రభావం ఒక్కసారిగా యావత్ ప్రపంచానికి ఏమిటో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.
ఏఐపై ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ..
గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) తన పనితీరును బలంగా చూపించడం మొదలు పెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగం పెరిగే కొద్దీ సంస్థల్లో ఉద్యోగుల అవసరం తగ్గిపోతున్నదని, మానవ వనరులకు ఇది అతి పెద్ద ముప్పుగా వాటిల్లే అవకాశం ఉన్నదని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనుకున్నట్లుగానే ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీలు ఏఐపై ప్రత్యేకంగా ఉద్యోగులకు శిక్షణనిచ్చేలా కార్యాచరణను రూపొందించాయి. విప్రో కంపెనీలో పనిచేస్తున్న 2.50 లక్షల మంది ఉద్యోగులకు ఏఐలో శిక్షణనిస్తున్నట్టు ఇటీవలే ప్రకటించగా, ఇందుకోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తున్నదని సమాచారం. ఉద్యోగుల కోసం ఏఐ కరిక్యులమ్ రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. మరో దేశీయ దిగ్గజ కంపెనీ టీసీఎస్ సైతం దాదాపు 25 వేల మంది ఐటీ ఉద్యోగులకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్పై శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నామని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇలా విప్రో, టీసీఎస్ కంపెనీలే కాకుండా ప్రముఖ కంపెనీలు సైతం ఏఐ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యతనిస్తూ, అందులో తమ ఉద్యోగులకు నైపుణ్యం పెంచేలా చేసి, కొత్త ప్రాజెక్టులను రూపొందించే బాధ్యతలను అప్పగించనున్నాయి. ప్రతి రంగంలోనూ ఏఐని వినియోగించేందుకు అవకాశం ఉండటంతో ఇప్పటికే పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు ఏఐపై శిక్షణ అనేది తప్పనిసరిగా మారింది.
దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికరం..
ఏఐ వాడకం పెరిగే కొద్ది మానవ వనరుల అవసరం తగ్గిస్తుందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఏఐ వల్ల నిరుద్యోగిత శాతం తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సాఫ్ట్వేర్కు సంబంధించిన సర్వీసెస్లో, టెక్నాలజీ సంబంధిత సంస్థల్లోనూ ఏఐ వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు అనేక సంస్థలు తమ వ్యాపార సేవలను ఏఐతో భర్తీ చేసే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. పరిస్థితి ఇలాగే, కొనసాగితే మాత్రం తీవ్ర భయంకరమైన నిరుద్యోగానికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన నియంత్రణ విధించకపోతే మాత్రం దీని దాటికి మరిన్ని తీవ్ర పరిణామాలు చవి చూడాల్సిన పరిస్థితులు రావొచ్చని పేర్కొంటున్నారు.
ఏఐ ఒక విప్లవాత్మక శక్తిగా ఉద్భవిస్తోంది
నేటి ఆధునిక టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ ఒక విప్లవాత్మక శక్తిగా ఉద్బవించింది. విద్యా రంగంలో విద్యార్థులు ఏఐ చాట్బాట్ వంటి సాధనాలు వినియోగిస్తారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల గడపడానికి, వారి వ్యక్తిగత అవసరాన్ని మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, ఆ తర్వాత దానికి అనుగుణంగా పాఠ్యాంశాలను బోధించడానికి దారి చూపుతున్నది. కేస్ స్టడీస్ను రూపొందించడం, ఇ-మెయిల్స్ రాయడం, బోధనా వ్యూహాలను పునరాలోచించడంలో సహాయం చేయడానికి దీనిని సమర్థవంతంగా ఉపయోగించవచ్చు.
– డాక్టర్ స్కంద్ బాలి, ప్రిన్సిపాల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
చాట్ జీపీటీ ఆవిష్కరణతో ఏఐకి భారీ ప్రచారం
చాట్ జీపీటీని ఆవిష్కరించిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు భారీ ప్రచారం వచ్చింది. టాస్క్ల ఆటోమేషన్తో సహ అనేక ఇంజనీరింగ్ రంగాల్లో ఏఐ ఆప్లికేషన్లను కలిగి ఉంది. ఇది ఉత్పాదకతను భారీగా పెంచుతుంది. ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నది. ఇది సాంప్రదాయ ఐటీ ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తుందంటే, ఏఐ స్పెషలైజేషన్ ఉన్న విద్యార్థులు రాబోయే రోజుల్లో కచ్ఛితంగా ప్రయోజనాన్ని పొందుతారు. ఏఐపై ప్రాథమికంగా పరిజ్ఞానాన్ని కల్పించడానికి అధ్యాపకులకు ఇది సరైన సమయం. దీని ద్వారా వారు సరైన సమయంలో ఏఐ గురించి ఎంతో నేర్చుకోవచ్చు.
– కరుణ్ తాడేపల్లి, బైట్ ఎక్సెల్ సీఈఓ, కో ఫౌండర్