సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ)/ఎల్బీనగర్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా నగర ప్రజలు ఊరెళ్లడంతో ఎల్బీనగర్ రింగ్రోడ్డు బస్ స్టాండ్ ప్రాంతంతో పాటు టోల్ ప్లాజాల వద్ద భారీ ట్రాఫిక్ రద్దీ నెలకొన్నది. పండుగకు పెద్ద ఎత్తున ప్రజలు వివిధ మార్గాల ద్వారా తమ సొంతూర్లకు తరలివెళ్లారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పంతంగి, బీబీనగర్ టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ తీవ్రంగా ఉందని, ఎల్బీనగర్లోని విజయవాడ వెళ్లే బస్స్టాండ్ వద్ద ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపించిందని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
పంతంగి టోల్ ప్లాజా నుంచి..
హైదరాబాద్ – విజయవాడ రహదారిలో పంతంగి టోల్ ప్లాజా వద్ద జనవరి 12వ తేదీన మొత్తం 56,595 వాహనాలు వెళ్లాయి. వాటిలో కార్లు 42,844, ఆర్టీసీ బస్సులు, 1300, ప్రైవేటు బస్సులు 4,913, గూడ్స్ ఇతర వాహనాలు కలిపి 7,538 వాహనాలు ప్రయాణించాయి. ఇక 13వ తేదీన మొత్తం వాహనాలు 67,577 వాహనాలు వెళ్లగా, వాటిలో కార్లు 53,561, ఆర్టీసీ బస్సులు 1851, ప్రైవేటు బస్సులు 4,906, గూడ్స్, ఇతర వాహనాలు 7,259 ప్రయాణించాయి.
బీబీనగర్ టోల్ ప్లాజా నుంచి వెళ్లిన వాహనాలు
ఇక బీబీనగర్ టోల్ ప్లాజా నుంచి జనవరి 13వ తేదీన మొత్తం వాహనాలు 25,231 ప్రయాణించాయి. వాటిలో కార్లు 17,844, బస్సులు 872 టోల్ ప్లాజా నుంచి గ్రామాలవైపు ప్రయాణించాయి.
ఎల్బీనగర్ బస్టాండ్లో….
సంక్రాంతి పండుగ సందర్భంగా ఎల్బీనగర్లో విజయవాడకు బస్సులు వెళ్లే బస్ స్టాండ్ ప్రాంతం రెండు రోజులుగా కిక్కిరిసి కనిపించింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులతో పాటు ఆర్టీసీ ప్రత్యేక బృందాలు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షణ చేశారు. మొత్తంగా సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.