సికింద్రాబాద్, నవంబర్ 28: కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రతి బస్తీలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసే విధంగా కృషి చేస్తున్నట్లు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి తెలిపారు. బోర్డులో నిధుల లేమి కారణంగా అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఒకటో వార్డులోని పెద్దతోకట్టతో పాటు పలు బస్తీల్లో స్థానికులతో కలిసి జక్కుల మహేశ్వర్రెడ్డి పర్యటించారు. ప్రధానంగా ఆయా డ్రైనేజీ సమస్యతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను జక్కుల దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. అనంతరం జక్కుల మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే పెద్దతోకట్ట ప్రాంతంలోని సీసీ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ.5 లక్షలు మంజూరయ్యాయన్నారు. అదేవిధంగా డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం కంటోన్మెంట్లో అమలయ్యే విధంగా చొరవ తీసుకుంటున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. వార్డులో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి నేరుగా తీసుకొస్తే తక్షణమే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో స్థానికులు విఠల్యాదవ్, రామ్, శ్రీనివాస్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.