సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): నేపాలీ ముఠాల దొంగతనం తీరులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠాలు భారీ నెట్వర్క్తో ప్రధాన నగరాలలో పాతుకుపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముంబై, పుణే, బెంగళూర్ వంటి ప్రధాన నగరాలలో ఉండే కొన్ని ప్రధాన ముఠాలు క్షేత్ర స్థాయిలో దొంగతనాలు చేయించేందుకు చిన్న ముఠాలను రంగంలోకి దింపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనాలకు పాల్పడే నేపాలీ ముఠాలకు.. దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఉంటున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. భారత్లో చోరీచేసి.. దేశం విడిచి వెళ్లే సరికి.. దొంగిలించిన సొత్తును అజ్ఞాతంలో ఉండే తమ బాస్లకు, గ్యాంగ్ లీడర్ల చేతికి అప్పగిస్తున్నారు. దొంగిలించిన సొత్తుతో దూర ప్రయాణం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతోపాటు పోలీసులు వేగంగా స్పందిస్తూ ఈ ముఠాలను పట్టుకోవడం కోసం గాలిస్తుంటారు. దీంతో దొంగిలించిన సొత్తు వీలైనంత త్వరగా తమ వారికి అప్పగించేలా పక్కా ప్లాన్తో ఈ ముఠాలు వ్యవహరిస్తున్నాయి. చోరీ సొత్తు తమ వెంట ఉండటం వల్ల ఎక్కడో ఓ దగ్గర పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉన్నదని గుర్తిస్తున్న ముఠాలు.. దొంగతనం జరిగిన ప్రాంతం నుంచే ఒక్కొక్కరి దగ్గర కొంత సొమ్మును దాచుకొని, వేర్వేరు మార్గాల ద్వారా బయటకు వెళ్లిపోతున్నారు.
దేశ సరిహద్దులో సిటీ పోలీస్
ఇటీవల సికింద్రాబాద్లోని ఒక ఇంటికి కన్నం వేసి, రూ.5 కోట్లకు పైగా సొత్తు దోచుకుపోయిన నేపాలీ గ్యాంగ్లో కొందరి ఆచూకీ తెలిసినా, ప్రధాన నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగాయి. ఒక బృందం ముంబై, మరికొన్ని బృందాలు పుణే, బెంగళూర్లో దొంగల కోసం వెతుకుతున్నారు. ఇంతటితో ఆగకుండా దేశ సరిహద్దు నుంచి నేపాల్కు వెళ్లేందుకు ఉన్న మార్గాలలో మరికొన్ని బృందాలు వెళ్లి కాపుకాస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ ముఠాలు నెట్వర్క్ను కలిగి ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ దిశగానే ముఠాల నెట్వర్క్ను ఛేదించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. గతంలో నేపాలీ ముఠాలు చోరీ చేసి, నేరుగా తమ దేశానికి వెళ్లిపోయాయి. తెలంగాణ పోలీసులు నేపాల్కు వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో నిందితులను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికైనా తెలంగాణ పోలీసులు వస్తారనే విషయాన్ని గుర్తించిన ఈ దొంగల ముఠాలు.. కొత్త వ్యూహంతో దొంగతనం చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ముంబైలో ముఠా నాయకులు
నేపాల్కు చెందిన ముఠాల నాయకులు ఎక్కువగా ముంబైలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగిలించిన సొమ్మును ముంబైలో ఒక చోట అప్పగిస్తే, దొంగలకు అందులో నుంచి కొంత కమీషన్ ఇచ్చి.. అక్కడి నుంచి ఈ ముఠాలు పోలీసులకు చిక్కకుండా ఉండే చోటకు తరలిస్తారు. అయితే, నేపాలీ దొంగలను పోలీసులు గుర్తించినా, ఆ ముఠా నాయకుడు ఎక్కడ ఉంటాడో ఆ దొంగలకు కూడా తెలియకుండా ముంబై ముఠా నాయకులు జాగ్రత్తలు తీసుకుంటారు. సికింద్రాబాద్ ఘటనలో నేపాలీ ముఠా చోరీ చేసి మూడు, నాలుగు టీమ్లుగా విడిపోయారు. ముఠాలోని ఒక బృందం ముంబై, మరో బృందం బెంగళూర్, ఇంకో బృందం పుణేకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్క ముఠాను గుర్తిస్తూ వారి నుంచి సమాచారం రాబడుతున్నారు.