సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ) : ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) భవిష్యత్ అవసరాల కోసం ఆర్ అండ్ ఆర్ కింద సేకరించిన మూడు ఎకరాల స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) అధికారులు శనివారం ఉదయం నేలమట్టం చేశారు. విజయవాడ జాతీయ రహదారి సమీపంలో హెచ్ఎండీఏ యాజమాన్యం హకులు కలిగిన మూడు ఎకరాల ఖాళీ స్థలంపై స్థానికులు కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో హెచ్ఎండీఏ భూ రికార్డులను సరిచూసుకుని స్థానిక తహసీల్దార్, పోలీసుల సహకారంతో హెచ్ఎండీఏ, ఓఆర్ఆర్ ల్యాండ్ ఎక్విజేషన్ అధికారి వి.విక్టర్, ఎన్ఫోర్స్ మెంట్ డీఎస్పీ (ఇంచార్జీ) వెంకటేశ్ తమ సిబ్బందితో కలిసి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు.
ఐదుగురిపై అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. వాస్తవానికి అబ్దుల్లాపూర్ మెట్ మండలం, పెద్ద అంబర్ పేట గ్రామంపరిధిలోని 3 ఎకరాల భూములను 2010 డిసెంబర్ 31వ తేదీన అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పంచనామా చేసి హెచ్ఎండీఏకి అప్పగించారు. ఔటర్ రింగురోడ్డులో భూములు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా భూమి ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం ఈ భూమిని హెచ్ఎండీఏకి కేటాయించిందని అధికారులు తెలిపారు. హెచ్ఎండీఏ భూములను అక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని, ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.