మియాపూర్, నవంబర్ 26 : నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి కేటీఆర్ తోడ్పాటుతో కోట్లాది నిధులు మంజూరు చేయిస్తూ అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. పనులపై పర్యవేక్షణతోపాటు సకాలంలో పూర్తి చేసేలా కార్పొరేటర్లు నిత్యం డివిజన్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని కూకట్పల్లి పార్ట్, వివేకానందనగర్, హైదర్నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్లకు చెందిన అభివృద్ధి పనులపై కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, శ్రీనివాస్రావు, వెంకటేశ్ గౌడ్, మాజీ కార్పొరేటర్ రంగారావు, ఈఈ గోవర్ధన్గౌడ్లతో కలిసి శనివారం తన నివాసంలో విప్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల్లో రాజీలేదని, ప్రజా సౌకర్యమే తమకు ప్రధానమన్నారు.
కాలనీలో కావాల్సిన పనులపై తగు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని, యూజీడీ, రోడ్లు ఇతర మౌలిక వసతులకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు పూర్తి చేయించాలని, కాలనీ వాసులను భాగస్వాములను చేస్తూ అభివృద్ధి పనుల్లో ముందుకు సాగాలని విప్ గాంధీ సూచించారు. అసంపూర్తి పనుల్లో వేగం పెంచాలని, వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని విప్ గాంధీ నివాసంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేలా ప్రతి పౌరుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని విప్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోహన్ గౌడ్, రంగారావు, లక్ష్మీనారాయణ, మోజెస్, ఇబ్రహీం, రాము, శ్రావణిరెడ్డి, మంజుల, విక్కీ, జానయ్య పాల్గొన్నారు.
మాదాపూర్, నవంబర్ 26:హఫీజ్పేట్ డివిజన్ హుడా కాలనీలోని ప్రొఫెసర్ జయశంకర్ పార్క్లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ సిద్ధాంత కర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహావిష్కరణకు ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ విచ్చేసి స్థానిక కార్పొరేటర్ వి.పూజిత గౌడ్, మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్లతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణ సిద్ధాంతకర్త, జయశంకర్ సార్ జీవితాంతం తెలంగాణ కొరకు పరితపించిన మహనుభావుడని అన్నారు.
ఉద్యమ ప్రధాత, మహనీయుడు విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం జయశంకర్ సార్ విగ్రహ దాతలను ఓక్ట్రీ కిడ్స్ స్కూల్ ఫౌండర్ బాబు రూప, జయశంకర్ పార్క్ కమిటీ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్లను విప్ గాంధీ, కార్పొరేటర్లు పూజిత గౌడ్, జగదీశ్వర్ గౌడ్ శాలువాను కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి, కరుణాకర్ గౌడ్, దామోదర్రెడ్డి, వెంకటేశ్వర్రావు, సురేశ్, శంకర్, మహేశ్ తదితరులు ఉన్నారు.