బంజారాహిల్స్, జూన్ 14: షాద్నగర్లో తక్కువ ధరకు ప్లాట్లు అంటూ నమ్మించి పలువురి వద్దనుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్తో పాటు పలువురు ఉద్యోగులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకృష్ణానగర్లో నివాసముంటున్న కొండల్రావు సహా 21మంది సినీ పరిశ్రమలో పనిచేస్తుంటారు. 2017లో వీరికి జూబ్లీహిల్స్ రోడ్ నం. 5లోని సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన గంగిరెడ్డి దస్తగిరిరెడ్డి పరిచయమయ్యాడు. షాద్నగర్ సమీపంలో తమ సంస్థ సువర్ణ కుటీర్ పేరుతో వేస్తున్న సరికొత్త వెంచర్లో అతి తక్కువ ధరల్లోనే ప్లాట్లు ఇస్తోందని నమ్మించాడు. వారిని ఆఫీసుకు తీసుకువెళ్లి సంస్థ ఎండీ బొల్లినేని శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా శ్రీనివాస్కు పరిచయం చేశాడు.
రూ.1,900లకు గజం చొప్పున ప్లాట్లు విక్రయిస్తామని, మూడేండ్లలో డబ్బులు చెల్లిస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తామని సంస్థ ఎండీ సహా ఇతర ప్రతినిధులు నమ్మబలికారు. దీంతో బాధితులంతా తాము తీసుకున్న ప్లాట్లకు సంబంధించిన మొత్తం డబ్బు చెల్లించారు. ఒక్కొక్కరు రూ.6లక్షల నుంచి రూ.50లక్షల వరకు సుమారు రెండున్నర కోట్లకుపైగా చెల్లించగా.. వీరికి సంస్థ తరఫున దస్తగిరి రెడ్డి రశీదులు ఇచ్చాడు. కరోనా కారణంగా ఏడాదిన్నర గడువు పెంచడంతో 2022 వరకు చెల్లింపులు కొనసాగాయి. అయితే, డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించకపోవడంతో ఈనెల 6న బాధితులంతా జూబ్లీహిల్స్లోని సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయానికి వెళ్లారు. తాము చెల్లించిన రశీదులు చూపించి వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు.
రశీదులు చూసిన సంస్థ ఎండీ శ్రీధర్తో పాటు మేకా శ్రీనివాస్ తదితరులు.. వాటిలో కొన్ని మాత్రమే తమ సంస్థకు చెందినవని, మిగిలిన రశీదులతో తమకు సంబంధం లేదని తేల్చేశారు. అయితే, తాము సువర్ణభూమి సంస్థను చూసే సంస్థ ప్రతినిధికి డబ్బులు చెల్లించి రశీదులు తీసుకున్నామని, తమకు రిజిస్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత సంస్థదేనని చెప్పినా పట్టించుకోలేదు. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన కొండల్రావుతో పాటు ఇతర బాధితులు బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ బొల్లినేని శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా శ్రీనివాస్, గంగిరెడ్డి దస్తగిరిరెడ్డి, మార్కెటింగ్ జీఎం ప్రవీణ్, అకౌంట్స్ విభాగం ప్రతినిధి సుధాకర్, తదితరులపై ఐపీసీ 420, 406, 467,471 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.