శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 2 : జాతీయ రహదారిపై చేపడుతున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని మల్లిక కన్వెన్షన్ వరకు పొడిగించాలని కోరుతూ కౌన్సిలర్ మేకల వెంకటేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షకు మద్దతు పెరుగుతుంది. శంషాబాద్కు బచావో- బ్రిడ్జి బడావో అనే నినాదంతో నాలుగు రోజుల నుంచి శంషాబాద్ పట్టణ ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మేకల వెంకటేశ్ మాట్లాడుతూ కేవలం కాంట్రాక్టర్ కోసం జాతీయ రహదారి అధికారులు బ్రిడ్జిని కుదించి నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. పలుమార్లు సర్వే చేసి ఇప్పడు వారికి ఇష్ట్రం వచ్చినట్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.
ప్రారంభంలో మల్లిక కన్వేన్షన్ నుంచి ఎయిర్పోర్టు బ్రిడ్జి వరకు చేపడుతామని ప్రణాళిక తయారు చేసిన జాతీయ రహదారి అధికారులు కాంట్రాక్టర్ కోసం ఫ్లైఓవర్ బ్రిడ్జి కూరగాయాల మార్కెట్ వరకు కుదించడంతో సిద్ధాంతి బస్తీ ప్రజలకు తీరని శాపంగా మారిందని తెలిపారు. గురువారం మండలంలోని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. మొయినాబాద్, షాబాద్, మహేశ్వరం, కోత్తూరు, నందిగామ మండలాలకు చెందిన రైతులు కూరగాయాల మార్కెట్కు రావడం కోసం అనేక ఇబ్బందులు తప్పవని వివరించారు.