ప్రయాణం సాఫీగా సాగేందుకు చేపట్టిన సీఆర్ఎంపీ (కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్) మొదటి దశ విజయవంతమైంది. 811.958 కిలోమీటర్ల మేర పనులను బల్దియా పూర్తి చేసింది. ఇందుకు రూ. 1050 కోట్లను వెచ్చించింది. రెండేండ్ల పాటు ఏజెన్సీలు నిర్వహణ బాధ్యతలు చూడనున్నాయి. ఈ క్రమంలో సీఆర్ఎంపీ రెండో దశపై దృష్టి సారించిన అధికారులు.. రూ.700 కోట్ల అంచనా వ్యయంతో 450 కిలోమీటర్ల పనులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. అనుమతి రాగానే రెండో దశ పట్టాలెక్కనున్నది.
సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ) : కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకం తొలి విడత పనులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రధాన రహదారుల నిర్వహణలో భాగంగా 525 విభాగాలుగా విభజించి తొలి విడతగా 811.958 కిలోమీటర్ల రహదారిని ప్రైవేట్ ఏజెన్సీలకు 2020 సంవత్సరంలో నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దాదాపు రూ.1050కోట్ల మేర ఖర్చు చేసి నిర్ణీత లక్ష్యాన్ని ఇటీవల చేరుకున్నారు. రహదారి పనులతో పాటు సెంట్రల్ మీడియన్, లేన్ మార్కింగ్, కెర్బ్ పెయింటింగ్లు, సైన్బోర్డుల ఏర్పాటు, గుంతల పూడ్చివేత పనులను చేపట్టారు. ఐదేళ్ల పాటు నిర్వహణలో భాగంగా రాబోయే రెండు సంవత్సరాల పాటు కేవలం నిర్వహణ బాధ్యతలు మాత్రమే సదరు ఏజెన్సీలు చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే రెండో విడత పథకం పనులపై జీహెచ్ఎంసీ దృష్టి సారించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రెండో దశ సీఆర్ఎంపీలో పెద్ద పెద్ద కాలనీల రోడ్లను తీసుకుని ప్రతిపాదనలు రూపొందించారు. 450 కిలోమీటర్ల మేర పనులను గుర్తించి రూ. 700కోట్ల అంచనాతో ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు సమర్పించారు. త్వరలో రెండో దశ పనులపై స్పష్టత రానుంది. ఐతే మొదటి విడతలో ప్రధాన రహదారుల ప్రైవేట్ నిర్వహణ మెరుగైన ఫలితాలను రాబట్టింది. ఎంత పని జరిగితే అంత వరకే బిల్లులు చెల్లిస్తుండడం..ముందస్తు అంచనా వేసిన ప్రకారం ప్రాజెక్టు వ్యయం సైతం మిగులు దిశగా సాగుతుండడం గమనార్హం. ఇందులో భాగంగానే ప్రాజెక్టు వ్యయాన్ని పెంచకుండా అదనంగా 102.47కిలోమీటర్ల రోడ్లను సీఆర్ఎంపీలోకి చేర్చి ప్రజాధనాన్ని సద్వినియోగం చేసినట్లు ఇంజినీరింగ్ విభాగం అధికారులు తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని ఏ మాత్రం ఉపేక్షించరాదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన దరిమిలా సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణను పక్కాగా చేపడుతున్నది. గుంతలు లేకుండా చూడడం, మ్యాన్హోళ్ల సమస్యలు, రోడ్లు దెబ్బతినడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. రోడ్ల నిర్వహణ, పనుల్లో పౌరులను భాగస్వామ్యం చేశారు. రహదారుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే పౌరులు సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా అధికారులు విస్తృత అవగాహన చేపట్టారు. ఇందుకోసం వాట్సాప్, ట్విట్టర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. దాదాపు 3వేల మంది ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు రూ.20 లక్షల మేర జరిమానా విధించారు.