సిటీబ్యూరో, జూన్ 29(నమస్తే తెలంగాణ): గుండెపోటుతో మృతి చెందిన రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ పార్థీవ దేహాన్ని నగర శివారులోని గుర్రంగూడలో తన స్వగృహంలో పలువురి సందర్శనార్థం ఉంచారు. పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, పలువురు కళాకారులు నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కు మార్, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, గాదరి కిషోర్, ఎమ్మెల్సీ శం భీపూర్ రాజులతో పాటు పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ నేతలు సాయిచంద్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ ఉద్యమ సమయంతో పాటు రాష్ట్ర పునర్నిర్మాణంలో సాయిచంద్ పాత్ర మరువలేనిదని, తెలంగాణ గొప్ప కళాకారుడిని కోల్పోయిందని పలువురు ప్రజా ప్రతినిధులు, కళాకారులు కన్నీటి పర్యంతమయ్యారు. సాయిచంద్తో తమకున్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరు గుర్తుచేసుకున్నారు. నివాళులర్పించిన వారిలో నగర డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, దేవిప్రసాద్, పటోళ్ళ కార్తీక్రెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాచకొండ సీపీ చౌహన్, రాష్ట్ర బేవరేజెస్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్రావు, మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, కేఎస్ రత్నం, గాయకులు, రచయితలు గద్దర్ ప్రజా పార్టీ అధ్యక్షుడు గద్దర్, విమలక్క, జయరాజ్, మిట్టపల్లి సురేందర్, సుద్దాల అశోక్ తేజ, మధుప్రియ, బీజేపీ నేత ఈటల రాజేందర్, శ్రవణ్ కు మార్, టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్, మాల మహానాడు జాతీ య అధ్యక్షుడు చెన్నయ్య, పబ్బతి శ్రీకృష్ణ, బేర బాలకిషన్, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, ప్రజా సంఘాల నాయకులు, అరుణోదయ, ఉద్యమ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజలు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.