పదకొండు రోజుల పాటు సాహితీప్రియులను అలరించిన బుక్ఫెయిర్ ఆదివారంతో ముగిసింది. చివరిరోజు కావడంతో సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో చరఖా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): నైతిక విలువలు నేర్పేది పుస్తకమేనని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. తెలంగాణ కళాభారతిలో ఏర్పాటు చేసిన 35వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగింపు సభకు ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ సోమా భరత్కుమార్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ హాజరయ్యారు. బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన సభా కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ.. ఇంటర్నెట్ వచ్చాక పిల్లల్లో వచ్చిన మార్పులు చూస్తుంటే ఆందోళన అనిపించినా, ఇలాంటి పుస్తక ప్రదర్శన ద్వారా ఆ అపోహలు తొలగిపోయాయని చెప్పారు. హైదరాబాద్లో 100 సూళ్లను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని సిలబస్ మార్చే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. అందులో నీతి కథలు, పర్యావరణం, వ్యక్తిత్వ నిర్మాణం, సమాజం అంటే ఏంటో తెలిపే విధంగా పాఠ్యాంశాలుగా చేర్చబోతున్నామని పేర్కొన్నారు. గ్రంథాలయాలను గ్రామస్థాయిలోకి తీసుకుపోయేందుకు బుక్ ఫెయిర్ నిర్వాహకులు ప్రభుత్వం తరుపున చేయాల్సిన సహకారాన్ని సీఎం కేసీఆర్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గులాంగిరీ పుస్తకం ప్రభావితం చేసింది..
గులాంగిరీ పుస్తకం తనను ప్రభావితం చేసిందని బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక పుస్తక భాండాగారంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు. పుస్తక పండుగను ఏర్పాటు చేయడం గొప్ప ఒరవడిగా ఆయన పేర్కొన్నారు.
గ్రంథాలయాల ఆధునికీకరణ
పుస్తక వేడుక ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ గమనించారని, అందుకే ప్రతి సంవత్సరం పుస్తక జాతరను ప్రోత్సహించి దిశా నిర్దేశనం చేస్తున్నారని రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. నగరంలో 82 గ్రంథాలయాలను 27 కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. 5వేల పాఠశాలల్లో రీడింగ్ రూంలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పుస్తక ప్రియుడు కేసీఆర్ అని రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ అన్నారు. పుస్తకంతోనే మనోవిజ్ఞానం వికసిస్తుందని పేర్కొన్నారు.
ఆదివారం చివరి రోజు కావడంతో సందర్శకులు కిక్కిరిసిపోయారు. తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తూ సందడిగా గడిపారు. మొత్తం పుస్తక వేడుకలో 10లక్షల మంది సందర్శకులు రాగా, ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ వేదికపై 100 పుస్తకాలను ఆవిష్కరించారు. అదేవిధంగా 15 ముఖాముఖి చర్చలు నిర్వహించారు.
సాహితీప్రియుడు సీఎం కేసీఆర్
పుస్తకం విలువ తెలిసిన సాహితీప్రియుడు సీఎం కేసీఆర్ అని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. యువత భవిష్యత్ నిర్మాతలు కావాలంటే పుస్తకాలు చదవాల్సిందేనని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరమే ప్రభుత్వం పుస్తక ప్రదర్శన నిర్వహించేందుకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నదని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుస్తకాల చదువరి అని ఆయన పేర్కొన్నారు.
ప్రజల గొంతుక ఎర్రజెండానే..
సీపీఎం సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి రచించిన ప్రజల గొంతుక రాజకీయ సామాజిక వ్యాసాలు-అసెంబ్లీ ప్రసంగాలు రెండో ముద్రణను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, నవతెలంగాణ జనరల్ మేనేజర్ వాసు, బుక్ ఫెయిర్ వైస్ ప్రెసిడెంట్ కోయ చంద్రమోహన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ డైరెక్టర్ రాజేందర్రెడ్డి ఆవిష్కరించారు.
కొత్త సాహిత్యంతో వస్తాం
అక్షరయాన్-106 స్టాల్స్ అఆల నుంచి, అవకాశాల కల్పన ఆలోచనల వేదికగా నిలిచింది. మహిళా రచయితలను ప్రోత్సహించేందుకు ప్రతియేటా పుస్తకాల జాతరలో మా స్టాల్ ఉంటుంది. ఇది ఎంతో సంతోషం. పుస్తక వేడుకలను నిర్వహించేందుకు ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది. మాతృభాషను ప్రేమించడం, మాతృభాషను గౌరవించడం, మాతృభూమిని పూజించడం ముఖ్యవిధిగా అక్షరయాన్ పనిచేస్తున్నది. వచ్చే ఏడాది కొత్త సాహిత్యంతో వస్తాం.
– శ్రీలక్ష్మి, ప్రముఖ రచయిత్రి
పుస్తకప్రియులకు పండుగ
హైదరాబాద్ బుక్ ఫెయిర్కు యువత, విద్యార్థులు ఎక్కువగా వచ్చారు. పుస్తక సాహిత్యంపై ఎక్కువగా మక్కువ చూపారు. నేటి పిల్లలకు యువతకు పుస్తక పఠనం తప్పనిసరిగా చేయాలి. నూతన పుస్తకాలను రాయడానికి యువత ఆసక్తి చూపుతున్నారు. 11 రోజులుగా బుక్ ఫెయిర్ ద్వారా పుస్తక ప్రియులకు పండుగ వాతావరణం ఏర్పడింది. పుస్తక పఠనం ద్వారా క్రమశిక్షణ పెంపొందుతుంది.
– మిద్దె సురేశ్ కవి, తొలకరి జల్లు రచయిత
బుక్ ఫెయిర్లో చరఖా ప్రదర్శన
కవాడిగూడ, జనవరి 1: బుక్ ఫెయిర్ చివరిరోజు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో గాంధీ చరఖ ప్రదర్శన జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, ఉపాధ్యక్షుడు కోయ చంద్రమెహన్, సీపీఎం మాజీ ఎమ్మోల్యే జూలకంటి రంగారెడ్డి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ డైరెక్టర్ రాజేందర్రెడ్డి, రామానందదీర్థ డైరెక్టర్ కిశోర్రెడ్డిలు ప్రారంభించారు. సాంబశివరావు మాట్లాడుతూ.. బ్రిటీష్ వారిని పారదోలేందుకు గాంధీ చెరఖ ఉద్యమం దేశాన్ని ఏకం చేసిందని అన్నారు.
ఆంగ్ల సాహిత్యాన్ని ఆదరించారు..
నాయిస్ క్యాన్సిలేషన్ పుస్తకాన్ని నగరానికి చెందిన యువ కవి, విద్యావేత్త డాక్టర్ జీలం చటరాజ్ రచించారు. ప్రముఖ రచయిత్రి దేవయాని కొంకటితో పుస్తక ప్రదర్శనలో సంభాషణ కార్యక్రమం జరిగింది. భారతీయ కవిత్వంలో తన రచనలు పాఠకులు ఆదరించడంతో పాటు ఆంగ్ల సాహిత్యాన్ని కూడా యువత ఎక్కువగా ఆదరించారని ఆమె తెలిపారు.