సిటీబ్యూరో,ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ)/నేరేడ్మెట్: సైబర్ నేరగాళ్లు విశ్రాంత ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేసి రూ. 85 లక్షలు దోచేయడంతో పాటు మరో రూ.42 లక్షలు కాజేసేందుకు బాధితుడిని బెదిరించడంతో నేరెడ్మెట్ పోలీసులను ఆశ్రయించడంతో కాపాడారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆగస్టు 21వ తేదీన నేరేడ్మెట్కు చెందిన 82 ఏండ్ల రిటైర్డు ఉద్యోగి శివయ్యకు ఓ నంబర్ నుంచి కాల్ వచ్చింది.. అవతలి వ్యక్తి తాను ఎన్ఐఏ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. మీ ఆధార్ దుర్వినియోగం అయ్యిందని అబ్దుల్ సలాం అనే వ్యక్తి బ్యాంకు ఖాతాకు రూ. 2.5 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగాయని, కర్ణాటక, కేరళ రాష్ర్టాల్లో కూడా అక్రమ ఖాతాలున్నాయంటూ బాధితుడిని భయపెట్టించారు. బాధితుడిని నమ్మించేందుకు తాము విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నామంటూ తెలుగులో చెబుతూ యూనిఫాం ధరించిన ఒక వ్యక్తి వీడియో కాల్లో మాట్లాడాడు. దీంతో ఆ వ్యక్తిని నిజమైన ఎన్ఐఏ అధికారిగానే బాధితుడు నమ్మాడు.
మీకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేందుకు ఆర్బీఐ వెరిఫికేషన్ చేస్తుందని, మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు మొత్తాన్ని పరిశీలనకు ఆర్బీఐ నేతృత్వంలోని బ్యాంకు ఖాతాకు పంపించాలంటూ నమ్మించి అతడి బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ. 85.20 లక్షలు నిందితుల ఖాతాకు బదిలీ చేయించారు. మరుసటి రోజు ఫోన్ చేసి మరిన్ని డబ్బులు పంపించాలంటూ బెదిరింపులకు దిగా రు. దీంతో బాధితుడు స్థానికంగా ఉన్న కో ఆపరేటివ్ బ్యాం కుకు వెళ్లి తన ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును సైబర్నేరగాళ్లు సూచించిన ఖాతాకు బదిలీ చేయడానికి ప్రయత్నించాడు. వృద్ధుడైన ఆయన ప్రవర్తనపై, ఆందోళనపై సిబ్బందికి అనుమానం వచ్చిబ్యాంకు సిబ్బంది ఆయనతో మాట్లాడారు. ఎవరికి డబ్బు పంపిస్తున్నారంటూ ఆయనను అడగడంతో ఎన్ఐఏ కేసు, ఆర్బీఐకి డబ్బులు పంపిస్తున్నానంటూ చెప్పారు.
ఇదంతా మోసమని ఆయనకు బ్యాంకు చెప్పి..మీరు నేరెడ్మెట్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. నేరేడ్మెట్ స్టేషన్కు వెళ్లిన బాధితు డు విషయం చెప్పడంతో ఇన్స్పెక్టర్ వెంకటయ్య నేతృత్వం లో సైబర్ క్రైమ్ టీమ్ అలర్ట్ అయ్యింది. బాధితుడికి నచ్చజెప్పి జరిగిన మోసం గూర్చి వివరించారు. ఎన్సీఆర్పీ లో బాధితుడితో ఫిర్యాదు చేయించి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులతో మాట్లాడి, బాధితుడు బదిలీ చేసిన రూ. 85.2 లక్షల నగదు ఉన్న ఖాతాను ఫ్రీజ్ చేయించారు. రూ. 42 లక్షలు సైబర్నేరగాళ్ల చేతికి చిక్కకుండా చేయడంతో నేరెడ్మెట్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.