సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కుల్లిపోయిన మాంసం.. బూజుపట్టిన చికెన్.. మురిగిపోయిన కూరగాయలు.. ఈగలు, బొద్ధింకలు, ఎలుకలతో సహవాసం చేస్తున్న వంటశాలలు.. అపరిశుభ్రమైన పరిసరాలు.. ఇదీ గ్రేటర్ పరిధిలోని పలు హోటళ్లు, దాబాలు, బేకరీలు, బిర్యానీ సెంటర్లు, స్వీట్ షాప్ల దుస్థితి. పెద్ద అక్షరాలతో నోరూరించే ఆకర్శనీయమైన బోర్డులు, గుమగుమలాడే వాసనలతో భోజన ప్రియలను ఆకర్శిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, బేకరీలలో నిర్వాహకులు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి, ఆహార భద్రత నియమాలను తుంగలో తొక్కేసి ధనార్జనే ధ్యేయంగా జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ఏ హోటల్కు వెళ్లి చూసినా కుల్లిన మాంసం.. మురిగిపోయిన కూరగాయలు.. కలుషిత ఆహార పదార్థాలు.. టీజీ-సేఫ్ నిర్వహిస్తున్న దాడుల్లో ఒక్కొక్కటిగా ఆహార సంస్థల నిర్వాహకుల దారుణాలు బయట పడుతున్నాయి. అయితే ఇవి అధికారుల దాడుల్లో చిక్కిన మచ్చుక కొన్ని ఘటనలు మాత్రమే. తనిఖీలకు నోచుకోని బడాబాబులు, అమాత్యులు, అక్రమార్కుల కబంద హస్తాల్లో ప్రజల ఆరోగ్యాన్ని కుల్లబొడుస్తున్న హోటళ్లు, దాబాలు, బేకరీలు, బిర్యానీ సెంటర్లు మరెన్నో.
గురువారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా 46 రెస్టారెంట్లు, బేకరీలు, దాబాలు, హోటళ్లు, స్వీట్ షాపులు, హాస్టళ్లపై టీజీ-సేఫ్ బృందాలు నిర్వహించిన తనిఖీలలో పలు ఆహార సంస్థల్లో కలుషితమైన, కుళ్లిపోయిన మాంసం, కూరగాయలు వంటివి బయటపడ్డాయి. మరికొన్ని హోటళ్లు, బేకరీలు, బిర్యానీ సెంటర్లులో బొద్దింకలు, ఈగలు, ఎలుకల బెడద ఉన్నట్లు గుర్తించారు. పలు చోట్ల పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు రికార్డుల నిర్వహణలోనూ లోపాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కొన్ని ఆహార సంస్థల్లో రిఫ్రిజిరేటర్లను అపరిశుభ్రంగా నిర్వహిస్తున్నట్లు టీజీ సేఫ్ అధికారులు గుర్తించారు. శాఖాహార, మాంసాహార పదార్థాలను సరైన విధంగా వేరు చేయకపోవడం, ఆహార పదార్థాలకు లేబుల్స్ ఏర్పాటు చేయకపోవడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి. గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పురుగుల బారిన పడిన ఆహార పదార్థాలు కూడా గుర్తించినట్లు టీజీ-సేఫ్ అధికారులు వెల్లడించారు. ఆహార పదార్థాలను తయారు చేసే సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం కూడా తనిఖీల్లో వెలుగుచూసింది.
అక్రమాలు, కల్తీపై ఆహార పదార్థాలకు సంబంధించి వచ్చిన అనుమానాలతో 22 ఆహార పదర్థాల నమూనాలను అధికారులు సేకరించారు. కుళ్లిపోయిన కూరగాయలు, పురుగుల బారిన పడిన ఇతర ఆహార పదార్థాలను అకడికకడే ధ్వంసం చేశారు.
తనిఖీల్లో గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలని 23 ఆహార సంస్థలకు ఇంప్రూవ్ మెంట్ నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆయా సంస్థలను తిరిగి తనిఖీ చేసి ఆహార భద్రతా నిబంధనల అమలును పరిశీలిస్తామని, రీ-ఇన్ స్పెక్షన్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని టీజీ-సేఫ్ స్పష్టం చేసింది.
ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా మూడు సంస్థలకు సంబంధించిన ఎఫ్ఎస్ఎస్ఎఐ లైసెన్సులను సస్పెండ్ చేసి, వెంటనే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించనున్నట్లు అధికారులు తెలిపారు.
స్టేషన్ ఘన్ పూర్ : మహేంద్ర మీల్స్ , బిర్యానీ అండ్ కర్రీ పాయింట్
కరీంనగర్ (బావ్ పేట్) : శ్రీ బాలాజీ మ్యాజిక్ మిఠాయి
యాదాద్రి భువనగిరి జిల్లా : చా చా ఫ్యామిలీ దాబా – ఎన్ హెచ్ -65, తుప్రాన్ పేట్