తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమల తనిఖీ అధికారులు వసూళ్ల దందా సాగిస్తున్నారు. కాలుష్య కారకాలను విడుదల చేస్తున్న పరిశ్రమలను చూసీచూడనట్లు వదిలేస్తూ ఆయా ప్రాంతాలను కలుషితం చేస్తున్నారు. పరిశ్రమలు శాస్త్రీయమైన నిబంధనలు పాటిస్తున్నాయా? వ్యర్థాల్లో కలుషిత కారకాలను విడుదల చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయా? అందుకోసం అన్ని నిబంధనలు అవలంబిస్తున్నాయా? అనే విషయాలేవీ పట్టించుకోకుండా వ్యవరిస్తున్నారు. నామమాత్రంగా తనిఖీలు చేస్తూ పరిశ్రమల యజమానులిచ్చే మామూళ్ల దందాను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నారు.
-సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) పారిశ్రామికవాడల నుంచి ప్రమాదకరమైన రసాయనాలు ఇబ్బడిముబ్బడిగా వెలువడుతూ.. ప్రజలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నా పీసీబీ తనిఖీ అధికారులు పట్టించుకోవడం లేదు. తనిఖీల పేరిట పరిశ్రమలను సందర్శించి.. తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. ఆయా పరిశ్రమల నుంచి నీటి శాంపిళ్లను సేకరించి నామమాత్రపు పరీక్షలతో క్లీన్చిట్ ఇస్తున్నారు. రసాయన, ఫార్మా పరిశ్రమలు కనీస ప్రమాణాలు పాటించేలా నిత్యం తనిఖీలు చేసి, చర్యలు తీసుకోవాల్సిన అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు వసూళ్లకు తెగబడుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది. వారి సహకారంతోనే పరిశ్రమలు నిబంధనలు ఉల్లంఘిస్తూ హానికర రసాయనాలను బహిరంగ ప్రదేశాలకు వదులుతున్నారు. ఆయా పరిశ్రమల యజమానులతో కుమ్మక్కై పరిశ్రమల చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, పంట పొలాలను కాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్నారు.
కాలుష్య నియంత్రణ మండలి నుంచి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు పరిశ్రమల సాధారణ తనిఖీలకు వెళ్తుంటారు. వీరితో ఒక వాహనాన్ని ఔట్ సోర్సిం గ్ సిబ్బంది అయిన ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లను తీసుకెళ్తారు. పరిశ్రమను బట్టి డస్ట్ శాంపిళ్లు, వాటర్ శాంపిళ్లు సేకరించి పీసీబీ సైంటిఫిక్ ల్యాబ్లో టెస్టులు నిర్వహిస్తారు. ఆయా శాంపిళ్లలో కాలుష్య కారకాలుంటే సంబంధిత పరిశ్రమలపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తారు. కానీ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఇవేమీ పద్ధతి ప్రకారం జరగటంలేదని తెలుస్తున్నది. తనిఖీలు చేయడం, శాంపిళ్లను సేకరించడం వరకు సరిగ్గానే జరుగుతున్నా.. వాటిలో కాలుష్య కారకాలను మాత్రం గుర్తించడంలేదు. తనిఖీలకు వెళ్లిన ఏఈఎస్లు సంబంధిత పరిశ్రమల యజమానులతో కుమ్మక్కై వసూళ్లకు పాల్పడుతూ క్లీన్చిట్ ఇస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందులో ఓ ముగ్గురు ఏఈఎస్లు ప్రధానంగా ఉన్నట్లు సమాచారం. వారివెంట తీసుకెళ్తున్న డ్రైవర్ను ఈ వసూళ్లకు నియమించుకున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఆ ఏఈఎస్ల వెంట వెళ్లే ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా ఆ డ్రైవరు చెప్పినవాళ్లనే తీసుకెళ్తున్నారు. తనిఖీల తర్వాత పరిశ్రమల యజమానుల దగ్గర తీసుకున్న డబ్బును తన అకౌంట్లోనే వేసుకుని ఆ తర్వాత నగదు రూపంలో ఏఈఎస్లకు పంచుతారు. ఈ వసూళ్ల దందాలో ఏండ్ల తరబడిగా ఆ డ్రైవర్ నమ్మకంగా ఉండటంతో ఇప్పుడు పీసీబీ సైంటిఫిక్ విభాగంలో ఆయన ఇష్టారాజ్యం నడుస్తున్నట్లు ఉద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఏఈఎస్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ఆ డ్రైవర్ చెప్పినట్లు నడుచుకుంటున్నట్లు ఉన్నతాధికారుల దాకా గుసగుసలు వినిపిస్తున్నాయి.
పారిశ్రామికవాడలు, శివారు ప్రాంతాల్లోని ఫార్మా, రసాయన కంపెనీలు పెద్ద మొ త్తంలో వ్యర్థ జలాలను విడుదల చేస్తాయి. ఆయా పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థ జలాలను ఏఈఎస్లు సేకరించి పరీక్షించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం కనీస తనిఖీలు నిర్వహించడంకపోవడంతో ప్రజలు ప్రాణాంతక వ్యాధులబారిన పడుతున్నారు. అందులో భాగంగానే ఇటీవ ల భూదాన్పోచంపల్లి మండలంలో హెజలో ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలి ఇద్దరు చనిపోయారు. ఈనేపథ్యంలో నీటి శాంపిళ్లలో రసాయనాల తీవ్రతను బట్టి పీసీబీ ఉద్యోగులు పరిశ్రమల యజమానుల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. పరిశ్రమ ల యజమానులు అడిగినంత ఇవ్వడంతో ప్రాణాంతక రసాయనాలున్నా ఏమీ లేనట్లు క్లీన్చిట్ ఇస్తున్నారు. బాధితులు ఏండ్ల తరబడిగా పీసీబీ ముందు నిరసనలు చేస్తున్నా పట్టించుకోవడంలేదు. ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్చేస్తున్నారు.