మేడ్చల్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం జాతీయ పతాకాన్ని మంత్రి మల్లారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎనిమిదేండ్లుగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుస్తున్నాయని తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పరుస్తామని చెప్పారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, డీసీపీ సందీప్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, వివిధ విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా అంతటా త్రివర్ణ జెండాలు రెపరెపలాడాయి. కొంగరకలాన్లోని జిల్లా సమీకృత కలెక్టరేట్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, జిల్లా అదనపు కలెక్టర్లు తిరుపతి రావు, ప్రతీక్ జైన్, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణా రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జేఎల్ హరిప్రియ, జిల్లా పరిశ్రమల శాఖ జేడీ రాజేశ్వర్ రెడ్డి, డీఈవో సుసీంద్రరావు తదితరులు పాల్గొన్నారు.