సిటీబ్యూరో, మార్చి 31(నమస్తే తెలంగాణ): ప్రపంచ శ్రేణి క్రీడాకారులుగా రాణించడంతోపాటు ఒలింపిక్స్ లక్ష్యం నెరవేర్చేలా క్రీడాకారులు శ్రమించాలని తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి, హెచ్పీఎస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్పర్సన్ వాకాటి కరుణ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్పూల్ ప్రారంభోత్సవానికి వాకాటి కరుణ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, గౌరవ అతిథిగా స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ మోనల్ చోక్సీ, హెచ్పీఎస్ సొసైటీ అధ్యక్షుడు గుస్తి జె నోరియాలతో కలిసి స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు నొరియా మాట్లాడుతూ.. క్రీడల్లో మహోన్నత లక్ష్యాన్ని హెచ్పీఎస్ తన భుజానికెత్తుకున్నదని, విద్యతోపాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా అత్యున్నత ప్రతిభను విద్యార్థుల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తమ స్కూల్ ప్రాంగణంలో పర్యావరణహితమైన క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేందుకు రూ.25కోట్లు కేటాయించినట్లు చెప్పారు. సైక్లింగ్, స్విమ్మింగ్, బాడ్మింటన్, టేబుల్టెన్నిస్, హాకీ, షూటింగ్ వంటి అంశాలపై విద్యార్థులను తీర్చిదిద్దేందుకు దృష్టి సారించినట్లు, ఆర్టిస్టిక్-ఆక్వాటిక్ శిక్షణను విద్యార్థులకు అందిస్తామని తెలిపారు. 50 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పు, డెక్ ఏరియా 16వేల చదరపు అడుగులుగా ఉండగా, మొత్తం 8 వరుసలు ఉంటాయని, దాదాపుగా వెయ్యి మంది కూర్చునేందుకు వీలుంటుందని వెల్లడించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవ్ డియో సరస్వత్ మాట్లాడుతూ.. తమ విద్యార్థులను అంతర్జాతీయ క్రీడా వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించేలా సిద్ధం చేసి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.
నేషనల్ కజక్ బృందం (కజక్ సింక్రోస్టార్స్) యెరెన్ చెన్కో వాలెంటినా, ఐదా మీమాంటే, యెకటెరినా సిమోనోవా, ఆసియన్ చాంపియన్ ఆఖ్బషేవా అడెల్యేం, అలి యా కరియోవా, అలెగ్జాండ్రా నెమిచ్, యెకటెరినా నెమిచ్తోపాటు అర్నతొక్తాగన్ లాంటి స్విమ్మర్ల ప్రదర్శన విద్యార్థులు, ఉపాధ్యాయులతోపాటు సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఈత కొలనులో నీటిపై తేలుతూ ఆర్టిస్టిక్ స్విమ్మింగ్, అక్వాటిక్ ఏరోబిక్స్తో ఈత క్రీడాకారులు చక్కటి విన్యాసాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు సుశాంత్, సుమంత్లతోపాటు పలువురు ప్రముఖులు, పూర్వ విద్యార్థులు హాజరయ్యారు.