హిమాయత్నగర్, జూలై 20: ఆటో డ్రైవర్లను వేధింపులకు గురిచేస్తున్న ప్రైవేట్ ఫైనాన్షియర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నగరంలో ఆటో షోరూమ్ డీలర్లు, ప్రైవేట్ ఫైనాన్షియర్లతో కుమ్మక్కై అర్హులైన ఆటో డ్రైవర్లకు మంజూరైన కొత్త ఆటోలను ఇవ్వకుండా బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడుతున్నారని ఆరోపించారు.
షోరూం డీలర్లు అక్రమంగా కొత్త ఆటోలను ప్రైవేట్ ఫైనాన్షియర్లకు సరఫరా చేస్తున్నారని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు ముందస్తు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ప్రైవేట్ ఫైనాన్షియర్లు ఏ వాహనాన్ని స్వాధీనం చేసుకోవద్దని, ఫైనాన్స్ ఒప్పందం సమయంలో పేర్కొన్న వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీని వసూలు చేయవద్దన్నారు. ఆటోలను బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా ఉండేందుకు ఫైనాన్షియర్లు, షోరూం అసలు ధర మించకుండా ఆటోలకు ఫైనాన్స్ చేసేలా నిబంధనలు అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. కె.లక్ష్మీనర్సయ్య, ముజాహిద్ హాస్మీ,మీర్ ఫరూక్ అలీ పాల్గొన్నారు.