రవీంద్రభారతి, ఫిబ్రవరి 3: రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం టూరిజం హబ్గా మారనుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రాచకొండ బుద్ధ విహార ట్రస్టు ఆవిర్భావ సభ రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ లోగోను సుచిరిండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లయన్ కిరణ్తో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి జిల్లా ప్రకృతి సౌందర్యంతో పాటు చారిత్రాత్మక నేపథ్యం కలిగి ఉందన్నారు. బుద్ధుడి శిష్యులు నాగార్జున సాగర్, నల్గొండ జిల్లాలో సంచరించి బుద్ధుడి బోధనలను విస్తృతంగా ప్రచారం చేశారన్నారు.
రాష్ట్ర రాజధానికి అతి చేరువలో నల్గొండ జిల్లా శివన్నగూడ, అంతంపేట గ్రామాల మధ్య ప్రధాన రోడ్డుపై ఉన్న కొండపై బుద్ధుడి విగ్రహాన్ని నెలకొల్పినట్లు పేర్కొన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవి కుమార్ మాట్లాడుతూ శివన్నగూడెం శివారులోని బుద్ధ విగ్రహం ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గొప్ప సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. మే నెలలో బుద్ధుడి జయంతిని వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈఈ ఖాసీం, మేనేజింగ్ ట్రస్టీ గిరి నర్సింహ, వంగాల అమరేందర్రెడ్డి, టీజేఎఫ్ కార్యదర్శి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.