సిటీబ్యూరో, ఏప్రిల్ 27 ( నమస్తే తెలంగాణ ): ఆర్టీఏ సేవలు మరింత పారదర్శకంగా అందించడం కోసం రవాణా శాఖ తీసుకొచ్చిన సారథి, వాహన్ పోర్టల్ సేవలు సాంకేతిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. పూర్తిస్థాయి సేవలు అందించడానికి రెండు వారాల సమయం పట్టనున్నదని అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని రోజులుగా ఆర్టీఏ సర్వర్ మొరాయిస్తుండటంతో పలు రకాల ట్రాన్సక్షన్స్, స్లాట్స్కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైసెన్స్ స్లాట్ బుకింగ్ ప్రక్రియలో ఓటీపీలు రావడం లేదు. మరికొన్ని సేవల్లో ట్రాన్సక్షన్స్ విఫలమవుతున్నాయి.
అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం ఉండటం లేదని వాహనదారులు చెబుతున్నారు. టీఆర్ గడువు ముగిసినా రిజిస్ట్రేషన్ నంబర్లు రాకపోవడంతో వాహనాలు బయటకు తీయాలంటే వాహనదారులు భయపడాల్సి వస్తున్నది. మరోవైపు మీ సేవ సెంటర్లు కూడా సాంకేతిక ఇబ్బందులతో సేవలు అందించడం లేదు. ఇదిలా ఉంటే ట్రాన్సక్షన్స్ ఫెయిల్ అయినా డబ్బులు డ్రా అవుతున్నాయి. అలాంటి కేసుల్లో రీఫండ్ కోసం వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాల చుట్టు తిరగాల్సి వస్తున్నది. ఉన్నతాధికారులు స్పందించి సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.