సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ ప్రచార పర్వం తుది అంకానికి చేరుకుంది. మరో రెండు రోజుల్లో ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలోనే బరిలో ఉన్న 21 మంది అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలు, ఉపాధ్యాయ సంఘాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. టీచర్ల ఇంటింటికి వెళ్లి తమను గెలిపించాలని వేడుకుంటున్నారు. వాస్తవంగా ఈ ఎన్నికలకు రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష సంబంధాలు లేకపోయినా..అభ్యర్థుల ప్రచారం మాత్రం వాడివేడిగా సాగుతున్నది. కాగా, తొమ్మిది జిల్లాల పరిధిలో 29,720 మంది ఓటర్లు ఉండగా..సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. 16న కౌంటింగ్ ప్రక్రియ సరూర్నగర్ స్టేడియంలో ర్వహించనున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
బరిలో నిలిచిన 21 మంది అభ్యర్థుల పేర్లతో బ్యాలెట్ పత్రాలను మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఏఆర్ఓ (అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్)లకు అధికారులు ఇప్పటికే పంపిణీ చేశారు. బ్యాలెట్ పేపర్లలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏర్పాట్లలో భాగంగా 137 పోలింగ్ కేంద్రాలలో బందోబస్తు, ఇతర ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి డీఎస్ లోకేశ్కుమార్ రోజూ వారీ సమీక్ష జరుపుతున్నారు. అభ్యర్థుల ప్రవర్తన, నియమావళిని ఉల్లంఘించి ఓటర్లకు డబ్బు, మద్యం, ఇతరత్రా పంపిణీ చేస్తున్నట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే ‘సీ విజిల్’ మొబైల్ యాప్, 1950 నంబరుకు లేదా ఎంసీసీకి నోడల్ అధికారిగా ఉన్న జీహెచ్ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ ఎన్ ప్రకాశ్రెడ్డి కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.