సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టును రట్టు చేశారు నగర టీ-న్యాబ్ పోలీసులు. ముఠాకు చెందిన ప్రధాన నిందితుడితో సహా అతడి అనుచరుడిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.30వేల విలువ చేసే నిట్రవేట్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా కేసు పూర్వాపరాలను వెల్లడించారు. ఈనెల 4న హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాంగార్బస్తీకి చెందిన చక్రధరి, గిరిధరి ఇళ్లపై యాంటి నార్కొటిక్ బ్యూరో(టీ-న్యాబ్)పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 11 నిషేధిత నిట్రవెట్ మాత్రల డబ్బాలు, 22 ఎస్కుఫ్ దగ్గు సిరప్ బాటిళ్లు సహా రూ.16,780నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా బీదర్కు చెందిన ఇద్దరు వ్యక్తులు తమకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.
పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు హెచ్-న్యూకు చెందిన ఐదుమంది సభ్యులతో కూడిన పోలీసు బృందం నిందితులను పట్టుకునేందుకు కర్నాటకలోని బీదర్కు వెళ్లింది. ఈ క్రమంలో స్థానికంగ ఉన్న గాంధీ గంజ్ పోలీసుల సహకారంతో ప్రధాన నిందితుడైన బిర్జు ఉపాధ్యాయ(42)ఇంటిపై తెల్లవారుజాము ఒంటిగంట సమయంలో నగర పోలీసులు దాడులు జరిపారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడితో పాటు అతడి ఇద్దరు కుమారులు, అత్త, ఇద్దరు భార్యలు మొత్తం 8మంది కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా కత్తులు, కర్రలు, రాడ్లతో పోలీసు బృందంపై విరుచుకుపడ్డారు. డ్రగ్స్ ముఠా దాడిలో ఎస్ఐ వెంకట్రాములు, పీసీ నవీన్కాంత్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు నిందితులపై స్థానిక గాంధీ గంజ్ ఠాణాలో ఫిర్యాదు చేసిన నగర పోలీసు బృందం తిరిగి నగరానికి వచ్చేసింది. గాయపడ్డ పోలీసులను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ఇదిలా ఉండగా ప్రధాన నిందితుడు బిర్జు ఉపాధ్యాయ తన అనుచరుడైన కిషన్ విఠల్రావు కాంబ్లె(39)తో కలిసి నగరంలోని మాంగార్ బస్తీలో నివాసముండే బంధువులకు నిషేధిత నెట్రవెట్ మత్తు మాత్రలను సరఫరా చేసేందుకు శనివారం ఉదయం నగరానికి వచ్చారు. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న టీ-న్యాబ్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
14ఏళ్లుగా మత్తు దందా….
కర్ణాటక, బీదర్ ప్రాంతానికి చెందిన బిర్జు ఉపాధ్యాయకు ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమారులు. నిందితుడు గత 14సంవత్సరాలుగా తన కుటుంబ సభ్యులతో కలిసి కిషన్ విఠల్రావు కాంబ్లె సహకారంతో మత్తు నిట్రవెట్ మాత్రల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. బీదర్కు చెందిన సుప్రీత్ నావలే అనే వ్యక్తి వద్ద నుంచి 300నిట్రవెట్ మాత్రల బాక్స్ను రూ.2000చొప్పున కొనుగోలు చేసి, బీదర్, హైదరాబాద్ ప్రాంతాల్లో రూ.5,500కు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నాడు. బిర్జు ఉపాధ్యాయ తన కుమారుడు అర్వింద్, ఇద్దరు భార్యలు, అత్త రాణుబాయ్లు తమ బంధువులైన నగరంలో మాంగార్ బస్తీలో నివాసముండే చక్రధర్ భార్య పల్లవి, రాజులకు సరఫరా చేస్తుంటారు. చక్రధరి, రాజుతో పాటు మరికొంత మంది బిర్జు ఉపాధ్యాయ బంధువులు ఈ మత్తు మాత్రలను నగరంలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బిర్జుపై కర్ణాటక, బీదర్లోని మర్కెట ఠాణాలో 13క్రిమినల్ కేసులు నమోదై ఉండడంతో పాటు రౌడీషీట్కూడా నమోదై ఉంది.
అవి ప్రమాదకరమైన మాత్రలు:
నిట్రవెట్ అనే మత్తు మాత్రలు ప్రమాదకరమైనవని సీపీ తెలిపారు. ఈ మాత్రలను హెచ్ కేటగిరి కింద గుర్తించారని, ఇవి హిప్నోటిక్ డ్రగ్గా పనిచేస్తాయని, అంటే ఈ మాత్రలు తీసుకున్న వారు తమకు తాము అత్యంత బలవంతులుగా ఫీలవడం, స్వియ నియంత్రణ కోల్పోవడం, ఇతరులపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడడం వంటి హింసాత్మక చర్యలకు దిగే అవకాశముంటుందని తెలిపారు. ఈ మాత్రలకు వ్యసనంగా మారిన వారు విత్డ్రాయల్ సింటమ్స్కు గురవుతారని, ఇది మెదడులోని రసాయనాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ప్రాణాలకే ప్రమాదమని సీపీ హెచ్చరించారు.
తల్లిదండ్రులు పిల్లలపై పర్యవేక్షణ పెట్టాలి:
తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు తదితర అంశాలపై ఖచ్చితంగా పర్యవేక్షించాలని సీపీ సందీప్ తల్లిదండ్రులకు సూచించారు. ఈ మధ్య కాలంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలపై సరైన పర్యవేక్షణ పెట్టడం లేదని, పిల్లలకు సమయం కూడా కేటాయించడంలో విఫలమవుతున్నారన్నారు. ఎక్కడైన మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిసినా లేదా ఎవరైన వినియోగిస్తున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.