జిల్లాలో లభించే వనరులను అభివృద్ధి చేసి, అందుకు సంబంధించిన చిన్నతరహా పరిశ్రమలను ప్రొత్సహించి ఎగుమతులను పెంచాలని, తద్వారా యువతకు ఉద్యోగాలను కల్పించవచ్చని కలెక్టర్ శ్వేతా మహంతి వివరించారు. జిల్లా స్థాయి ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ మొదటి సమావేశం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ జిల్లాలో ఎగుమతి చేయగల వాటిని గుర్తించాలని, వాటి అభివృద్ధి చేయడం, ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా జిల్లాను ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా జిల్లా ఎగుమతి ప్రోత్సాహక ప్రణాళికను తయారు చేయాలని సూచించారు. వనరులను గుర్తించి దానికి తగినట్లుగా శిక్షణ ఇవ్వడంతో పాటు సెమినార్లు నిర్వహించాలని సూచించారు.
హైదరాబాద్ జిల్లాలో పరిశ్రమలను స్థాపించడం సాధ్యం కాదని, కానీ చిన్న పరిశ్రమలైన బంగారం, జ్యువెల్లరీ, బిద్రీ పనులను గుర్తించి వాటిని అభివృద్ధి చేసి ఎగుమతి చేయవచ్చునని వెల్లడించారు. ఆ పరిశ్రమలపై ఆధారపడిన వారికి శిక్షణ ఇచ్చి నాణ్యమైన వాటిని తయారు చేయవచ్చని ఉదహరించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పవన్కుమార్, సంయుక్త సంచాలకులు ఎంఏ ఖలీల్, పరిశ్రమల శాఖ కమిషనర్ రవిశంకర్, ఎల్డిఎం ఠాగూర్, జ్యువెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ మహేంద్ర కుమార్ తాయిల్, శివప్రసాద్, డీఐసీసీఐ దుర్గాప్రసాద్, టీఎస్ఐఐసీ సుధాకర్, టీఎస్ సీసీఐ సుజాత తదితరులు పాల్గొన్నారు.