సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ ): ఎల్బీనగర్ నియోజకవర్గం బీఎన్రెడ్డినగర్ డివిజన్ పద్మావతి బ్యాంకు కాలనీలో మ్యాన్హోల్లో పడి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనపై పురపాలక శాఖ తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై చర్యలకు సిఫారసు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ను ఆదేశిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్వహణలో రక్షణ చర్యలు, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా పూడికతీత పనులు నిర్వహించినందున సర్కిల్ -3 పరిధిలోని బాధ్యులు ఏఈ గౌతం, వర్క్ ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, నర్సింహారెడ్డిల సస్పెన్షన్, ఎస్ఈ, ఈఈ, డీఈఈలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఈ ఘటనపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వనస్థలిపురం/హయత్నగర్, ఆగస్టు 6: మ్యాన్హోల్లో పడి గల్లంతైన అంతయ్య ఆచూకీ ఇంకా లభించలేదు. మృతదేహం కోసం నిర్వీరామంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి తెలిపారు. శుక్రవారం హయత్నగర్లోని ఓ హోటల్లో ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, దయానంద్, మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. పసుమాముల చెరువులో మూడు బోట్లు, 4 రెస్క్యూ టీమ్లు, డ్రోన్ కెమెరాలతో పరిశీలిస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు.