సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : ఒక్క బండి కొంటే ఇన్ని పన్నులా? షోరూం ధర రూ.91వేల బండిపై వివిధ పన్నులతో రూ. 1.20 లక్షల ధర చేస్తున్న షోరూంల మాయాజాలంపై నమస్తే తెలంగాణ శుక్రవారం “షోరూంల దోపిడీ” శీర్షికన కథనం ప్రచురించింది. ఈ కథనపై రవాణా శాఖ స్పందించింది. షోరూంల్లో జరుగుతున్న మోసాలపై చర్యలు తీసుకోవడానికి జాయింట్ ట్రాన్స్పోర్ట్ అధికారితో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్ట పేర్కొంది. ఈ మేరకు జేటీసీ చంద్రశేఖర్గౌడ్ వివరాలు వెల్లడించారు. షోరూంల్లో ఆర్టీఏ చార్జీల పేరిట అదనంగా వసూలు చేస్తున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీలర్ల లైసెన్స్లు రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షోరూంల్లో తనిఖీలు చేసి రిపోర్ట్ ఇవ్వాలని డీటీసీ, ఆర్టీఓ, ఎంవీఐలకు ఆదేశాలిచ్చినట్టు వెల్లడించారు. వాహనదారులు మోసానికి గురి కావొద్దని అన్ని ధరలతో కూడిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే వాహనం కొనుగోలు చేయాలని సూచించారు.
ఒక వ్యక్తిపై రెండో వాహనం ఉంటే అదనంగా 2 శాతం పన్ను వసూలు చేసేవారు. అయితే దీనిని రవాణా శాఖ రద్దు చేసినట్టు తెలిపింది. మార్చి 23 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. సాధారణంగా ఒక వ్యక్తి మొదటిసారి వాహనం కొనుగోలు చేస్తే బండి ఖరీదు ఆధారంగా అంటే ఒక ద్విచక్ర వాహనమైతే 9 శాతం నుంచి 18 శాతం వరకు లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కారైతే 13 శాతం నుంచి 21 శాతం వరకు పన్ను చెల్లించాలి. దీంతో పాటు అదే వ్యక్తి రెండో వాహనం కొనుగోలు చేస్తే మొత్తం పన్నుతో పాటు 2 శాతం అదనంగా చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ 2 శాతం పన్ను రద్దు చేసినట్టు రవాణా శాఖ వెల్లడించింది. కాగా, మార్చి 23 నుంచి వాహన్ పోర్టల్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. వాహన్తో అనుసంధానంతో తెలంగాణ వాహనాల వివరాలన్నీ జాతీయ డాటాబేస్లో ఉంటాయని వివరించారు.