సిటీబ్యూరో,ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): డార్క్నెట్.. ఇప్పుడు ఇది ప్రతి దేశంలో పోలీసు వ్యవస్థకు సవాల్గా మారింది. సైబర్ నేరగాళ్ల నుంచి అంతర్జాతీయ క్రిమినల్స్, హ్యాకర్స్ ఇలా అనేక మంది ఇందులో తిష్ట వేసి.. ప్రత్యేక నేర ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఉన్న వారిని పట్టుకోవడం అసాధ్యం. రిజిస్టర్ అయ్యే ఐపీ అడ్రస్సులు ఎక్కడెక్కడో చూపిస్తుంటాయి. ఇంతటి కష్టతరమైన ‘డార్క్నెట్’లోకి సిటీ పోలీసులు ప్రవేశించారు. దీని ద్వారా వస్తున్న మాదకద్రవ్యాలపై నజర్ పెట్టారు. అలా చేసిన ప్రయత్నంలో హెచ్సీయూకు చెందిన విద్యార్థి గుట్టు బయటపడింది. పలువురు డ్రగ్స్ బాబులు దొరికిపోయారు.
వివిధ నేరాలకు, మోసాలకు అడ్డాగా మారిన డార్క్నెట్లోకి హైదరాబాద్ పోలీసులు ప్రవేశించారు. మొట్టమొదటి సారిగా డార్క్నెట్ వేదికగా సాగుతున్న డ్రగ్స్ దందాపై హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, ఎస్ఆర్నగర్ పోలీసులు, నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్విజన్ వింగ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థితో పాటు ఆరుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డిగ్రీ విద్యార్థులను అరెస్టు చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. బషీర్బాగ్ పోలీసు కమిషనర్ కార్యాలయం లో సీపీ సీవీ ఆనంద్ వెల్లడించిన వివరాల ప్రకారం…
స్నేహితుల ద్వారా..
గాజులరామరం ప్రాంతానికి చెందిన సాయి విగ్నేశ్ హైదరాబాద్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అతడికి తన స్నేహితుల ద్వారా డ్రగ్స్ అలవాటైంది. డార్క్ నెట్ ద్వారా రూ. 600కు తెప్పించుకుని వాటిని తన అవసరాలకు వాడుకోవడంతో పాటు మరికొన్నింటిని అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. ఇలా విగ్నేశ్ 20 ఎల్ఎస్డీ బ్లాట్స్ను ఆర్డర్ చేసి.. డెలివరీ తీసుకున్నాడు. వీటిని తన స్నేహితులైన అనుదీప్, నిఖిల్, ప్రీతం, వంశీ, రాహుల్ తేజ, సుష్మా, ఎలిజబెత్లతో కలిసి సేవించాడు. మరికొన్నింటికి ఇతరులకు అమ్మేశాడు. తాజాగా వీరంతా ఎల్ఎస్డీ బ్లాట్స్తో మత్తు సేవించి ఎంజాయ్ చేసేందుకు మైత్రివనం దగ్గర ప్లాన్ వేసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సోదాలు జరిపి విగ్నేశ్తో పాటు సాయి చైత్ర(డిగ్రీ విద్యార్థి), నాగార్జున(కామర్స్ విద్యార్థి), హేమంత్(నోవార్టిస్లో ఉద్యోగి), సాయి బాలాజీ(డీఎక్స్ టెక్నాలజీస్ ఉద్యోగి), అనుదీప్(సాఫ్ట్వేర్ డెవలపర్, ఐ-ప్రోగ్రామర్), తేజస్వి కుమార్(టెక్ మహీంద్ర-టెక్నికల్ సపోర్టు)లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 19 ఎల్ఎస్డీ బ్లాట్స్, ల్యాప్టాప్, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎల్ఎస్డీ బ్లాట్స్ను నాలుక పై పెట్టుకుని దాదాపు 7 ఏడు గంటల పాటు మత్తును ఆస్వాదిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
గంజాయి డోర్ డెలివరీ…
ధూల్పేట్కు చెందిన మహేందర్సింగ్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులకు గంజాయిని సరఫరా చేస్తున్నాడు. దీని కోసం ప్రత్యేకంగా ఓ గ్రూపును ఏర్పాటు చేసుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. పోలీసులు మహేందర్సింగ్ను అరెస్టు చేశారు. అతడి నుంచి గంజాయిని కొనుగోలు చేస్తున్న లఖాని జితేన్(కలెక్షన్ ఏజెంట్), రమ్య సిద్ధార్థ(డెలాయిట్ సంస్థ ఉద్యోగి), అనిశ్కుమార్(అమెజాన్, డేటా ఇంజినీర్), చిట్టుకుల సమరసింహారెడ్డి(సేఫ్ ఎక్స్ప్రెస్ సంస్థ ఉద్యోగి)లను కూడా పట్టుకున్నారు.
సరఫరాదారుడిగా స్టాక్ ట్రేడర్…
యాప్రాల్కు చెందిన స్టాక్ ట్రేడర్ జ్వాలా పాండే డ్రగ్స్తో పాటు గంజాయి, హశీశ్ అయిల్ను సరఫరా చేస్తున్నాడు. నిందితుడితో పాటు మరో 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
క్రైమ్ దునియాను ధ్వంసం చేస్తాం…
మొదటిసారి డార్క్నెట్లోకి అడుగుపెట్టి డ్రగ్స్ను తెప్పించుకుంటున్న నెట్వర్క్ను గుర్తించాం. అందులో నడిచే క్రైమ్ దునియాను ధ్వంసం చేస్తాం. కాలేజీలు, యూనివర్సిటీల యాజామన్యాలు సైతం విద్యార్థుల ప్రవర్తనపై నజర్ పెట్టాలి. డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాల వాడకం వల్ల ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో వారికి అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇలాంటి వ్యవహారాల్లో పట్టుబడితే.. వారి భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని వారికి తెలియజేయాలి. ఎల్ఎస్డీ, కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ వంటి డ్రగ్స్ను అక్రమంగా వ్యాపారం చేస్తున్న వారిలో అధికంగా నైజీరియాకు చెందిన వారే. వీరు దేశంలోని వివిధ పట్టణాల్లో స్థిరపడ్డారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా నివాసముంటున్న వారి చిట్టాను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అందిస్తాం.
-సిటీ సీపీ సీవీ ఆనంద్
ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే..
ఓయో హోటళ్ల నిర్వాహకులు రిజిస్టర్ను నిర్వహించాలని, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని సీపీ ఆనంద్ ఆదేశించారు. రూమ్లు ఇచ్చే ముందు ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్ ప్రధాన సూత్రధారి స్టార్బాయ్కు సంబంధించి త్వరలోనే కేంద్ర దర్యాప్తు అధికారులతో మాట్లాడి రెడ్ కార్నర్ నోటీసును జారీ చేస్తామని సీపీ తెలిపారు.