దుండిగల్, జూన్ 27 : వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని దుండిగల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ సుంకరి క్రిష్ణవేణికృష్ణ అన్నారు. మున్సిపాలిటీ సమావేశ మందిరంలో మంగళవారం చైర్పర్సన్ కౌన్సిలర్లు, వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వానాకాలం ముంచుకొస్తుండటంతో మున్సిపాలిటీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చైర్పర్సన్ ఆదేశాలు జారీ చేశారు.
ఇందుకోసం పెండింగ్లో ఉన్న డ్రైనేజీ, రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని, మ్యాన్హోల్స్పై మూతలు బిగించాలని సూచించారు. రాత్రి పూట స్ట్రీట్లైట్లు వెలిగేలా చూసుకోవాలన్నారు. ఇబ్బందులు తలెత్తిన పక్షంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ‘టోల్ఫ్రీ’నంబర్ను ఏర్పాటు చేయాలన్నారు. బోనాల పండుగకు మున్సిపాలిటీ పరిధిలోని ఆలయాలను ముస్తాబు చేయాలని, ఏవైనా అభివృద్ధి పనులు పెండింగ్లో ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరావు, వైస్ చైర్మన్ తుడం పద్మారావుతోపాటు పాలకవర్గం సభ్యులు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.