తెలుగు యూనివర్సిటీ, జూలై 19 : జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారానికి ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్తేజను 2023 సంవత్సరానికి ఎంపిక చేసినట్లు తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య తెలిపారు. తెలంగాణ సారస్వత పరిషత్తు, సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు సంయుక్తాధ్వర్యంలో అబిడ్స్ బొగ్గులకుంటలోని సారస్వత పరిషత్తు హాలులో ఈ నెల 27న ఉదయం 10.30గంటలకు జరగనున్న డాక్టర్ సి. నారాయణరెడ్డి 92వ జయంతిలో సుద్దాల అశోక్ తేజకు పురస్కారాన్ని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి ప్రదానం చేస్తారని వెల్లడించారు. పురస్కారం కింద 25వేల నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించనున్నట్లు ఆయన తెలిపారు. సుశీలా నారాయణ రెడ్డి ట్రస్టు ముద్రించిన పది మంది కవయిత్రులు, రచయిత్రుల గ్రంథాలను కూడా ఈ సభలో వక్తలు ఆవిష్కరిస్తారని చెన్నయ్య పేర్కొన్నారు.
21న అయినంపూడి శ్రీలక్ష్మికి సినారె వాగ్భూషణ పురస్కారం
తెలంగాణ కళా వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అందజేస్తున్న రాష్ట్ర స్థాయి వాగ్భూషణ పురస్కారానికి 2023 సంవత్సరానికి ప్రముఖ కవయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మిని ఎంపిక చేసినట్లు పురస్కార కమిటీ చైర్మన్ దాస్యం సేనాధిపతి, సంస్థ అధ్యక్షులు అనుముల దయాకర్ తెలిపారు. ఈ నెల 21న హైదరాబాద్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి సీహెచ్.విద్యాసాగర్రావు అయినంపూడి శ్రీలక్ష్మికి పురస్కారాన్ని ప్రదానం చేస్తారని వారు వెల్లడించారు.