తెలుగుయూనివర్సిటీ: విద్యార్థులలో స్పూర్తిని కలిగించే రచనలు సాగించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కవులు,కళాకారులు కృషి చేయాలని పర్యాటక, సాంస్కృతికశాఖామంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రముఖులకు సాహిత్య పురస్కారాల ప్రధానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది.
పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సాహితీవేత్తలు కథా ప్రక్రియలో కె. వి నరేందర్, విమర్శలో కె.పి అశోక్ కుమార్, ఇతర ప్రక్రియలలో అన్నవరం దేవేందర్లకు పురస్కారాలు అందజేశారు. వచన కవిత్వంలో నాగరాజు రామస్వామి తరపున తుమ్మూరి రాంమ్మోహనరావు, నవలా ప్రక్రియలో పరవస్తు లోకేశ్వర్ తరపున రాపోలు సుదర్శన్ పురస్కారం అందుకున్నారు. ప్రముఖ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి, కవులు వేణుసంకోజు, డాక్టర్ దామెర రాములు, సాహితీవేత్త ఐతా చంద్రయ్యలకు విశిష్ఠ పురస్కారం అందజేశారు. ఒక్కొక్కరికి పురస్కారం కింద 20వేల రూపాయల నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. యువ పురస్కారం పొందిన తగుళ్ళ గోపాల్కు 10వేల రూపాయల నగదుతో, జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పుస్తక పఠనాభిరుచి తగ్గుతున్న ఈ కాలంలో సమాజాన్ని ఆలోచింపజేస్తూ దారి చూపే రచనలు ఎంతో అవసరమన్నారు. తెలంగాణ ప్రాంతంలో కవులు కళాకారులకు కొదవలేదన్నారు. తెలంగాణలో జరిగిన అనేక పోరాటాలలో కవులు, కళాకారుల సాహిత్య ప్రభావాన్ని ఆయన కొనియాడారు. తెలంగాణ గొప్పదనాన్ని తమ సాహిత్యం ద్వారా ప్రపంచానికి చాటుతూ సామాజిక మాధ్యమాలను మంచిగా ఉపయోగించుకోవాలని సూచించారు. పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ వరప్రసాద్రెడ్డి మాట్లాడుతూ పుస్తకాలు ప్రయోజనకరంగా ఉండాలని అప్పుడే వాటికి సార్థకత ఉంటుందన్నారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య, మంత్రి రామారావు తదితరులు పాల్గొన్నారు.