బడంగ్పేట, ఫిబ్రవరి 4 : అన్ని రంగాల్లో పోటీ పెరిగిందని, విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకొని ముందుకెళ్లాలని సినీ నటుడు కార్తికేయ అన్నారు. మీర్పేటలోని నాగార్జున మాంటిస్సోరి, ఐఐటీ ఒలంపియాడ్ స్కూల్ 10వ వార్షికోత్సవానికి కార్తికేయ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పని చేసినా నూరు శాతం శ్రద్ధ, అంకిత భావంతో చేయాలని విద్యార్థులకు సూచించారు. విద్యతో పాటు విద్యార్థులు వ్యక్తిత్వ వికాసం, భావ వ్యక్తీకరణను పెంపొందించడానికి పలు కార్యక్రమాలు చేపట్టామని నాగార్జున విద్యా సంస్థల చైర్మన్ గుమ్మకొండ విఠల్రెడ్డి తెలిపారు. గత ఏడాది 10వ తరగతిలో 10 జీపీఏ పాయింట్లు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.