కవాడిగూడ, జూన్ 26: విద్యార్థులు వారు ఎంచుకున్న రంగాలలో రాణించి భారత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్, వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. దోమలగూడలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో వాసవీ పబ్లిక్ స్కూల్ 2023-24 విద్యా సంవత్సరానికి గాను నూతన విద్యార్థి నాయక మండలి ప్రమాణ స్వీకారోత్సవాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ జయశ్రీ రావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఇందుకు ముఖ్య అతిథిగా హాజరైన రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు ముందు చూపుతో ఆలోచించి వినూత్న అంశాలను ఆవిష్కరించే దిశగా పయనించాలన్నారు. విద్యార్థులు మున్ముందు శాస్త్ర వేత్తలుగా, వాణిజ్యవేత్తలుగా ఎదగాలని కోరారు. వాసవి అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు మాట్లాడుతూ గత నాలుగు దశాబ్ధాలుగా తమ సంస్థ నిరంతరం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నృత్య ప్రదర్శన, వసుదైక కుటుంబం పేరుతో ప్రదర్శించిన యోగా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, కో-ఆర్డినేటర్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.