హైదరాబాద్ : రాష్ట్రంలో జరుపుకొనే అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేష్ వేడుకలను (Ganesh celebrations) ప్రజలు శాంతియుతంగా (Peacefully) , ఘనంగా జరుపుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ (CP Chauhan) అన్నారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించిన భద్రత ఏర్పాట్ల (Security arrangements ) పై నేరెడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం డీసీపీలు, ఏసీపీలు, ఠాణా ఎస్హెచ్ఓలతో సమీక్ష నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ పండుగ వేళ ఎక్కడ కూడా చిన్న పొరపాటుకు తావు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో ఇన్స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లను సమీక్షించాలన్నారు. ఆయా ప్రాంతాల్లోని పౌర విభాగాలతో సమన్వయం (Coordination) చేసుకుంటూ ప్రశాంతమైన వాతావారణంలో వేడుకలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జీహెచ్ఎంసీ(GHMC), అగ్నిమాపక, నీటి పారుదల, వైద్య విద్యుత్, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఠాణాల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని, డయల్ 100కు వచ్చే కాల్స్పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
సోషల్మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దు
సోషల్మీడియాలో వచ్చే తప్పుడు వదంతులను (Rumors) ప్రజలు నమ్మవద్దని సీపీ చౌహాన్ కోరారు. తప్పుడు పోస్టులపై నిఘా ఉంటుందన్నారు. గణేష్ శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు, స్విమ్మర్స్, క్రేన్లు, లైటింగ్స్, సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నిమజ్జనం చేసే చెరువు కట్టల వద్ద ఆయా శాఖలతో కలిసి తగిన ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.