Hyderabad | అడ్డగుట్ట, ఫిబ్రవరి 21 : రోడ్డుమీద చిరు వ్యాపారాలను నిర్వహించుకుంటూ జీవితాలను సాగిస్తున్నాం.. మా వ్యాపారాలను తీసేసి మా బతుకులను రోడ్డుపాలు చేయకండయ్యా అని కాంగ్రెస్ ప్రభుత్వానికి, చిలకలగూడ ట్రాఫిక్ పోలీసులకు మొరపెట్టుకున్నారు. మెట్టుగూడ ప్రధాన రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారాలను నిర్వహించుకునే స్ట్రీట్ వెండర్స్ గత నాలుగు నెలలుగా తమ వ్యాపారాలను నిర్వహించు కోవడంలేదని శుక్రవారం నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వారి గోడును వెల్లబోసుకున్నారు.
ఈ సందర్భంగా మెట్టుగూడ – తార్నాక మీల్స్ ఫుడ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చింత రమేష్ మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా ఆలుగడ్డ బావి బస్టాప్ నుండి తార్నాక ఆఫీసర్స్ క్లబ్ వరకు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారాలను ఏర్పాటు చేసుకొని జీవనాన్ని సాగిస్తున్నామని వారు తెలిపారు. చిరు వ్యాపారాల జీవనోపాధి, క్రమబద్ధీకరణ చట్టం 2014లోని చాప్టర్ 2లోని 3(3)ప్రకారం ఏ చిరు వ్యాపారిని తొలగించరాదని చట్టం ఉందని ఆయన గుర్తు చేశారు. 2014 ప్రకారం మా ప్రాంతంలో సర్వే చేసి ప్రభుత్వం మాకు గుర్తింపు కార్డులు, స్కిల్ ట్రైనింగ్ , ఫుడ్ సేఫ్టీ అధికారుల ట్రైనింగ్ సర్టిఫికెట్లు అందజేశారని ఆయన తెలియజేశారు. 20 ఏళ్లుగా 120 కుటుంబాలు చిరు వ్యాపారాలను నిర్వహించుకుంటూ బతుకులను వెల్లదిస్తున్నారని, ఉన్నట్టుండి ట్రాఫిక్ పోలీసులు వ్యాపారాలను నిర్వహించుకోకుండా బండ్లను తొలగించడం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జిహెచ్ఎంసి విభాగం అధికారులు తమకు వ్యాపారాల నిర్వహించుకునేందుకు అనుమతిని కూడా ఇచ్చారని, కానీ పోలీసులు వ్యాపారాలను ఏర్పాటు చేసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. నాలుగు నెలలుగా వ్యాపారం లేకపోవడంతో ఫైనాన్స్ తీసుకున్న డబ్బులు చెల్లించలేక లలిత అనే చిరు వ్యాపారి ఒత్తిడి భరించలేక గుండెపోటుతో మరణించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నాలుగు నెలలుగా కుటుంబ పోషణ కష్టమవుతుందని, ఎటు దిక్కుతోచని పరిస్థితుల్లో కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయని ఆయన అన్నారు.
చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న బండ్లను తొలగిస్తున్నారని సమాచారం అందుకున్న మెట్టుగూడ కార్పొరేటర్ రాచూరి సునీత అక్కడికి చేరుకొని చిరు వ్యాపారులకు మద్దతుగా నిలిచారు. 20 ఏళ్లుగా వ్యాపారాలను నిర్వహించుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న వారిని వ్యాపారాలు ఏర్పాటు చేసుకోకుండా ఆటంకాలు సృష్టించడం సరైనది కాదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని, ఇది సరైనది కాదని ఆమె అన్నారు. చిరు వ్యాపారులకు వ్యాపారాలను ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించే అంతవరకు తను స్ట్రీట్ వెండర్స్ వైపు పోరాటాన్ని సాగిస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే ఇదంతా జరుగుతుందని, కక్ష సాధింపు రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని ఆమె హితవు పలికారు.
చేసుకుంటే కానీ బతకలేని జీవితాలు మావి. నాలుగు నెలలుగా వ్యాపారాలు బంద్ కావడంతో కుటుంబ నిర్వహణ కష్టమవుతుంది. వ్యాపారాలను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి అని ఎన్నిసార్లు ట్రాఫిక్ పోలీసులకు మొరపెట్టుకున్న వారు పట్టించుకోవడం లేదు. ఎవరికి ఇబ్బంది కలిగించకుండా వ్యాపారాలను నిర్వహించుకుంటామని స్పష్టంగా చెప్పిన వారు వినడం లేదు. – దుర్గా, చిరు వ్యాపారి
వ్యాపారాలను నిర్వహించుకుంటేనే జీవితాలు సాఫీగా గడిచే బతుకులు మావి. అధికారులు దయతలిచి మాకు రోడ్డు పక్కన వ్యాపారాలను నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించండి. మీకు జీవితాంతం మా కుటుంబాలు రుణపడి ఉంటాయి. – సరిత, చిరు వ్యాపారి