Lok Sabha Elections | రంగారెడ్డి, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కార్యాచరణను మొదలెట్టింది. అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి ఓటర్లుగా వారి పేర్లను నమోదు చేయించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్ప టికే పలు దఫాలుగా ఓటు నమోదుకు అవకాశం కల్పించిన ఈసీ యువతకు మరో అవకాశాన్ని ఇచ్చింది. అలాగే.. సిస్టమెటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్, ఎలక్టోరల్ పార్టిసిపేషన్(స్వీప్) ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. ఓటింగ్ సందర్భంగా ఓటర్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సహాయక పోలింగ్ కేంద్రాల ఏర్పా టుపైనా అధికారులు దృష్టి సారించారు.
గతేడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తగా..పట్టణాల్లోని ఓటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూప లేదు. 2018 ఎన్నికల్లో 62% పోలింగ్ కాగా.. తాజా ఎన్నికల్లో 59.96 శాతమే నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే..2 శాతానికి పైగా ఓటర్లు తగ్గారు. ఇబ్ర హీంపట్నం నియోజకవర్గంలో 74.93%, ఎల్బీనగర్లో 49.07%, మహేశ్వరం లో 55.39%, రాజేంద్రనగర్లో 55.83%, శేరిలింగంపల్లిలో 48.75%, చేవెళ్ల లో 74.18%, కల్వకుర్తిలో 83.26%, షాద్నగర్లో 82.09% పోలింగ్ నమో దైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడంతో ఈసారి అర్హులైన ప్రతి ఒక్క రినీ గుర్తించి ఓటర్లుగా పేర్లు నమోదు చేయించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇటీవల రెండుసార్లు ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిం చింది. ఫిబ్రవరి 8న తుది ఓటరు జాబితాను జిల్లా అధికారులు విడుదల చేశారు. అర్హులైన వారందరూ ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేయించుకునేందుకు ఎన్నికల సంఘం తాజాగా మరోసారి అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి 18 ఏండ్లు నిండిన యువతీయువకులు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు జాబితాలో మార్పులు, చేర్పులు, అనర్హుల పేర్లను తొలగించుకోవచ్చు.
సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో ఫారాలను పూర్తి చేసి అందజేసేలా బీఎల్వోలు శ్రద్ధ తీసుకుంటున్నారు. నామినేషన్ల ఘట్టానికి పదిరోజుల ముందు వరకూ ఈ ప్రక్రియ కొనసాగనున్నది. ప్రస్తుతం జిల్లాలో 35,91,987 మంది ఓటర్లుండగా.. స్వీప్ కార్యక్రమంలో ఓటు హక్కు తోపాటు ఓటు వినియోగంపైనా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వ హించేందుకు జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో రాష్ట్ర స్వీప్ కన్సల్టెంట్ భవానీశంకర్ పర్యటించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు యువతను చైతన్యం చేసి ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకునేలా అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించనున్నారు. అదేవిధంగా ఓటింగ్ సందర్భంగా ఇబ్బందులు తలెత్తకుండా 1,500 మంది ఓటర్ల కంటే ఎక్కువ ఓట్లు ఉంటే సహాయక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 3,369 పోలింగ్ కేంద్రాలుండగా…ఈ సంఖ్య లోక్సభ ఎన్నికల నాటికి మరింతగా పెరిగే అవకాశం ఉన్నది.