అమీర్పేట్, జూలై 7: తెలంగాణలో కర్రుగేడెట్ బాక్స్(అట్ట డబ్బాలు) ప్యాకేజింగ్ పరిశ్రమల ట్రేడ్ బాడీ అసోసియేషన్ ఆఫ్ కర్రుగేటెడ్ కేస్ ఆఫ్ తెలంగాణ (ఏసీసీటీ) రెండు రోజుల సమ్మిట్ శుక్రవారం బేగంపేటలోని హోటల్ గ్రాండ్ కాకతీయలో ప్రారంభమైంది. జనవరి 2027లో హైదరాబాద్ ఆతిథ్యమివ్వనున్న అంతర్జాతీయ కర్రుగేటెడ్ కేసు సంఘం (ఐసీసీఎ) అంతర్జాతీయ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించి ఐసీసీఏ వైస్ చైర్మన్ ఎం.ఎల్.అగర్వాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాల్లో కర్రుగేటెడ్ కేసుల తయారీ పరిశ్రమ సామర్ధ్యం అర మిలియన్ టన్నులు కాగా, తెలంగాణ పరిశ్రమ సంవత్సరానికి 15శాతం వృద్ధితో దూసుకుపోతుందని తెలిపారు. ఇది జాతీయ సగటు కంటే కొంత ఎక్కువేనన్నారు. ఈ సమావేశంలో భారతీయ కర్రుగేటెడ్ ప్యాకేజింగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కర్రుగేటెడ్ బాక్సుల తయారీకి ఉయోగపడే వివిధ ఉత్పత్తులతో కూడిన ప్రదర్శనను ఇండోర్కు చెందిన ఫెడరేషన్ ఆఫ్ కర్రుగేటెడ్ బాక్స్ తయారీదారుల సంఘం(ఎఫ్సీబీఎం) అధ్యక్షులు వినీత్జైన్ ప్రారంభించారు.