మూడేండ్లుగా మూత పడ్డ వైనం
28 నుంచి నెల పాటు కొనసాగనున్న వేసవి శిక్షణ శిబిరాలు
మియాపూర్ , ఏప్రిల్ 3 : కరోనాతో గడచిన మూడేండ్లుగా మూత పడ్డ వేసవి క్రీడా శిబిరాలు మళ్లీ కళను సంతరించుకోబోతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో వేసవి శిక్షణ శిబిరాలకు బల్దియా గ్రీన్ సీగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా వాటి నిర్వహణకు జోనల్ కమిషనర్, ఐఏఎస్ అధికారిణి ప్రియాంక నేతృత్వంలో జోనల్ క్రీడా విభాగం అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఈనెల 28 వ తేదీ నుంచి వచ్చే నెల 28 వ తేదీ వరకు జోన్ వ్యాప్తంగా వేసవి శిక్షణ శిబిరాలు కొనసాగనున్నాయి. సింహభాగం ప్రైవేటు పాఠశాలలు ఇరుకైన భవనాల్లో కొనసాగుతుండటం, తగు క్రీడా మైదానాలు లేకపోవటంతో విద్యార్థులు సైతం క్రీడలకు దూరం అవుతున్నారు. బల్దియా ఏర్పాటు చేస్తుస్న వేసవి శిక్షణా శిబిరాలు వారికి ఎంతో ఉపయుక్తంగా మారనున్నాయి.
58 మైదానాలు.. 17 అంశాలలో శిబిరాలు..
శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా ఈ నెల 28 నుంచి వేసవి క్రీడా శిక్ష ణ శిబిరాలు ప్రారంభం అవుతన్న నేపథ్యంలో ఇప్పటికే దీనిపై సంబంధిత విభాగం అధికారులు ప్రచారం చేస్తున్నారు. కాగా జోన్ పరిధిలోని శేరిలింగంపల్లి, చందానగర్, యూ సుఫ్గూడ, ఆర్సీపూర్పటాన్ చెరు సర్కిళ్ల పరిధిలో మొత్తం 58 క్రీడా మై దానాలలో వాటిని నిర్వహించనున్నా రు. నాలుగు సర్కిళ్లలో కలిపి చం దానగర్ సర్కిల్ పరిధిలోని అతి పెద్ద మైదానం. శిబిరంలో క్రికెట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, అథ్లెటిక్, యోగా, ఫుట్ బాల్, వాలీబాల్, షటిల్, స్కేటింగ్, కరాటే, హాకీ సహా మొత్తం 17 అంశాలలో శిక్షణను అందించనున్నారు. 6 నుంచి గరిష్టంగా 16 సంవత్సరాల వయసు కల వారు ఈ శిక్షణ శిబిరాల్లో చేరేందుకు అర్హులు. నెల రోజుల పాటు కోచ్ల పర్యవేక్షణలో శిబిరాల్లో ఆయా క్రీడలలో క్రీడాకారులకు తర్ఫీదునిస్తారు. ఆసక్తి కల చిన్నారులు తమ పేర్లను ఆన్లైన్ ద్వారా లేదా క్రీడా మైదానాల ఇన్చార్జిల వద్ద కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నారు. క్రికెట్, వాలీబాల్, షటిల్ క్రీడలకు రూ. 50 కాగా… మిగలిన 14 క్రీడలకు దరఖాస్తు రుసుము రూ.10 గా నిర్ణయించారు. దరఖాస్తు సహా ఇతర సలహాలకు గేమ్స్ ఇన్స్పెక్టర్ వీరానంద్ 9100910867 నంబర్లో సంప్రదించవచ్చు. కరోనాకు ముందు జోన్ వ్యాప్తంగా 17 క్రీడాంశాల్లో 58 మైదానాలలో సుమారు 2 వేల మంది వేసవి శిక్షణ శిబిరాలకు హాజరయ్యారు. మూడేండ్ల తరువాత ఈ ఏడాది సైతం ఎంతమేర హాజరవుతారనేది అధికారులు అంచనా వేయలేకపోతున్నారు.
ఏర్పాట్లు చేస్తున్నాం
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి జోన్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 28 నుంచి మే 28 వరకు జోన్ వ్యాప్తంగా పీజేఆర్ స్టేడియం సహా నాలుగు సర్కిళ్ల పరిధిలోని 58 మైదానాలలో శిబిరాలను నిర్వహిస్తాం. మొత్తం 17 క్రీడలలో శిక్షణ ఇస్తుండగా…6 నుంచి 16 సంవత్సరాల వయసు గల వారు చేరేందుకు అర్హులు. కరోనాతో రెండు సంవత్సరాలకు పైగా శిబిరాల నిర్వహణ నిలిచిపోయింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో వీటి నిర్వహణను పునః ప్రారంభిస్తున్నాం. -వెంకన్న నాయక్, డిప్యూటీ డైరెక్టర్