మాదాపూర్ : రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యూహత్మక నాలా విస్తరణ పనులను చేపడుతూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలను శాశ్వత పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు నుండి దీప్తీ శ్రీ నగర్ నాలా వరకు రూ. 15.88 కోట్ల నిధులతో 2.4 కిలో మీటర్ల మేర చేపడుతున్న నాలా విస్తరణ పనుల్లో భాగంగా రామకృష్ణ నగర్ కాలనీలో జరుగుతున్న నాలా విస్తరణ పనులను బుధవారం స్థానిక కార్పొరేటర్ వి.పూజిత గౌడ్తో పాటు మాదాపూర్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … ముంపుకు శాశ్వత పరిష్కారం దిశగా వ్యూహత్మక నాలా విస్తరణ పనులను చేపట్టడంతో ప్రజలకు ముంపు సమస్య తీరనున్నట్లు చెప్పారు. నాలాల విస్తరణలో భాగంగా ఇది వరకు సరైన ప్రణాళిక లేకపోవడంతో వర్షాకాలం సమయంలో ముంపు సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవడం జరిగిందని అన్నారు.
ఎన్నో ఏండ్ల నుండి తీరని సమస్య నేటితో తీరనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎరగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు వెంకటేష్ గౌడ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.