కుత్బుల్లాపూర్, జూన్ 27 : ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు జలమండలి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దానిలో భాగంగానే ఇటీవల ప్రవేశపెట్టిన కలుషిత నీటి మూలాలను గుర్తించే యంత్రాలను క్షేత్రస్థాయిలో నిమగ్నం చేయడంతో సత్ఫలితాలను సాధిస్తున్నది. గతంలో కలుషిత తాగునీటిని గుర్తించాలంటే జలమండలి అధికారులు, సిబ్బందికి నానాతంటాలు పడేవారు. రోడ్లు తవ్వడంతోపాటు ఎక్కడ తాగునీరు కలుషితం అవుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఉండేది. అందుకోసం రోడ్లు తవ్వడంతో, పైపులను సరి చేసుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు తలెత్తేవి. దీని కోసం సమయంతోపాటు సకాలంలో కలుషిత నీటి మూలాలు కనిపెట్టేందుకు సమయం వృథా అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కడైతే కలుషిత నీరు వస్తుందో అక్కడ జలమండలి అధికారులు, సిబ్బంది సంబంధిత యంత్రాన్ని తీసుకెళ్లి ప్రధాన గేటు వాల్వు వద్ద యంత్రం సాయంతో పైపులోకి పంపించి కిలోమీటర్ల మేరా ఎక్కడైతే లీకేజీగా మారిందో ఆ ప్రాంతాన్ని గుర్తించి సరి చేసేందుకు తక్షణమే పరిష్కారం లభిస్తుంది. దీంతో ఇక ప్రజలకు ఎలాంటి కలుషిత నీటి సరఫరా జరుగకుండా వెనువెంటనే పరిష్కారాన్ని చూపే యంత్రం ద్వారా సత్ఫలితాలను సాధిస్తున్నారు.
కలుషిత నీటికి తక్షణమే పరిష్కారం
జీడిమెట్ల డివిజన్ వెంకటేశ్వర కాలనీలో గత 15 రోజులుగా తాగునీరు కలుషితం కావడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో జలమండలి అధికారులకు వచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత విభాగం అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి యంత్రం సాయంతో కలుషిత నీటి ఆనవాళ్లను గుర్తించి, తక్షణమే పరిష్కార మార్గాన్ని చూపారు. ఆ ప్రాంతంలో కలుషిత నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి సురక్షిత తాగునీటిని అందించేలా సత్వర చర్యలు తీసుకున్నారు. దీంతో అధికారుల పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు.
సమస్య ఉంటే ఫిర్యాదు చేయండి
కలుషిత తాగునీటి సరఫరా అవుతుంటే వెంటనే స్థానికంగా ఉన్న సంబంధిత జలమండలి, సిబ్బంది దృష్టికి తీసుకురావాలి. వెంటనే ఆ ప్రాంతంలో యంత్రం సాయంతో క్షణాల్లో కలుషిత నీటిని అరికట్టి తాగునీటిని అందించేందుకు సత్వర చర్యలు తీసుకుంటాం. గతంలో మాదిరిగా ఇప్పుడు ఎలాంటి సమస్య లేకుండా పోయింది. యంత్రం సాయంతో ప్రజలకు మరింత సురక్షిత నీటిని అందించేందుకు అవకాశం వచ్చింది. ఇక నుంచి కలుషిత నీటికి అడ్డుకట్ట వేసేందుకు చాలా ఉపయోగపడుదుంది.
– శివప్రసాద్, జలమండలి విభాగం అధికారి