సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : మీడియా సంస్థల్లో దళితుల ప్రాతినిధ్యంతోనే సామాజిక మార్పు సాధ్యమని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో జనవరి 31, 1920లో మూక్ నాయక్ పత్రిక ఏర్పడిన సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ నెట్వర్క్ కన్వీనర్ (ఐడీజేఎన్) మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో మొదటి అంతర్జాతీయ దళిత్ మీడియా దినోత్సవం నిర్వహించారు. అతిథులుగా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, సీనియర్ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ కృష్ణ, ఇఫ్లూ ప్రొఫెసర్ సంతోష్ హాజరై ప్రసంగించారు. అంతకుముందు ఆన్లైన్ వేదికగా సీనియర్ ఐఏఎస్ అధికారి రాజశేఖర్ ఉండ్రు కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఐడీజేఎన్ జనరల్ సెక్రెటరీ రెమ్ బహదూర్ (నేపాల్), పుష్ప కుమార్ (పాకిస్థాన్) ప్రసంగించారు.
జాతీయవాదం పేరుతో దేశానికి పెనుముప్పు
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ మీడియా సంస్థల్లో దళితుల ప్రాతినిధ్యం అంతంత మాత్రమేనని, పత్రికారంగంలో దళిత జర్నలిస్టులు అత్యంత వివక్షను ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయని వివరించారు. జాతీయవాదం పేరుతో దేశానికి పెనుముప్పు ముంచుకొస్తున్నదని అణగారిన వర్గాలు చైతన్యవంతమై ఎదుర్కొనేందుకు బీసీలు, దళితులు, మహిళలు, ఆదివాసీలు, మైనార్టీలు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.
నైపుణ్యతను పెంపొందించుకోవాలి
ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. ప్రధాన స్రవంతిలోని పత్రికల్లో దళిత జర్నలిస్టుల సంఖ్య చెప్పుకోదగినవిధంగా లేదని, ఆ వర్గాల సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. 80వ దశకంలో వేళ్లమీద లెక్కపెట్టే విధంగా దళిత జర్నలిస్టులు ఉండేవారని, ప్రస్తుతం చెప్పుకోదగిన విధంగా సంఖ్య ఉండటం సంతోషించాల్సిన అంశమని తెలిపారు. అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని వృత్తి పరమైన విధానంలో చోటుచేసుకుంటున్న నైపుణ్యతను నిత్యం పెంపొందించుకోవాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని సూచించారు.
అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలి
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ పాత్రికేయ రంగంలో దళితుల పాత్ర కీలకంగా మారిందని, అందుకు తగిన విధంగా ఎస్సీల ప్రాతినిధ్యం ఉంటేనే దేశంలో ప్రభావవంతమైన మార్పులు రావడానికి అవకాశం ఉందని అన్నారు. అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సమావేశంలోని జర్నలిస్టులకు సూచించారు.
వాస్తవ చరిత్రను పరిరక్షించుకోవాలి
ప్రొఫెసర్ కృష్ణ, సంతోష్లు మాట్లాడుతూ చరిత్రను మతపరమైన దృక్పథంతో తిరిగి లిఖించాలనుకుంటున్నారని, ఆ కుట్రలను తిప్పికొడుతూ.. వాస్తవ చరిత్రను పరిరక్షించుకోవడానికి జర్నలిస్టులు కృషిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టు విశేషాల గురించి వీడియో చిత్రీకరణ ద్వారా ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ఐడీజేఎన్ ప్రతినిధులు జనార్ధన్, సంజీవ్, జాన్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ప్రతినిధులు ప్రతీక్, రవి, జర్నలిస్టులు బొందుగుల నాగరాజు, అశోక్, తదితరులు పాల్గొన్నారు.