కొండాపూర్, ఏప్రిల్ 24 : కరోనా తరువాత ప్రతి ఒక్కరి ఆలోచనలు మారిపోయాయని, ఆరోగ్యంగా ఉండేందుకు కల్తీ లేని ఆహారం కోసం వెతుకుతున్నారని సినీ నటుడు సోనూ సూద్(Sonu Sood) అన్నారు. నాలెడ్జ్ సిటీలోని ఐటీసీ కోహినూర్లో అశ్య ఫుడ్స్ ఉత్పత్తుల ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవి చంద్ర, హైకోర్టు జస్టిస్ విజయ్ సేన్రెడ్డి, కజికిస్తాన్ గౌరవ డాక్టర్ కౌన్సిల్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ లతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిట్నెస్ కాపాడుకునేందుకు తాను ముందు నుంచి కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని, నాణ్యమైన ఉత్పత్తులు ఉన్నాయంటే దేశంలో ఎక్కడి నుంచైనా తెప్పించుకుంటానని అన్నారు. రైతుల దగ్గరి నుంచి మార్కెట్కు వచ్చే సరికి ఆ ఉత్పత్తుల్లో ఎన్నో మార్పులు జరిగి నకిలీగా తయారు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడొద్దని ఆయన కోరారు.
ఈసందర్భంగా అశ్య ఫుడ్స్ అధినేత శశిధర్రెడ్డి రూపొందించిన పసుపు, మిరియాలు, కారం, కినోవా తదితర ఆరు రకాల ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ హర్షిత వెలివాల, జాతీయ పసుపు బోర్డు సెక్రటరి, ఐఏఎస్ భవానీ శ్రీ, పద్మశ్రీ మంజుల అనగాని, ఐపీఎస్ రాజీవ్ త్రివేది, ఏఐసీసీ సెక్రటరి సంపత్కుమార్, బీఆర్ఎస్ నేత పటోళ్ళ కార్తీక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.