సిటీబ్యూరో, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ) : నాలాల విస్తరణ, వరద నీటి కాలువల వ్యవస్థ మెరుగుదల పనులు పూర్తి చేయడంపై అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్లు శ్రీధర్, జియాఉద్దీన్, జోనల్ కమిషనర్లు, వ్యూహాత్మక నాలాల అభివృద్ధి (ఎస్ఎన్డీపీ) పథకం విభాగం అధికారులతో శుక్రవారం సీఎస్ సోమేశ్కుమార్ మసాబ్ట్యాంక్లోని సీడీఎంఏ కార్యాలయంలో సమావేశమై ఎస్ఎన్డీపీ పనుల పురోగతి, ఆస్తుల సేకరణ అంశాలపై సమీక్షించారు.
ప్రతి వారంలో ఒక రోజు తానే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, ప్రతి మంగళవారం ఉదయం 10.30 గంటలకు చేపడుతున్న పనుల పురోగతి, ఆస్తుల సేకరణపై సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. నాలాల విస్తరణ, అభివృద్ధి పనులను మిషన్ మోడల్లో చేపట్టాలని, రాబోయే నాలుగు నెలల్లోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసక్తి గల ఏజెన్సీలతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. టౌన్ప్లానింగ్, రెవెన్యూ ఇతర విభాగాలకు చెందిన అధికారులతో బృందాలను నియమించి ఒక్కో పని ఒక బృందానికి అప్పగించాలని సూచించారు. యుటిలిటీస్ డైవర్షన్, ఆస్తులు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయింపు, ప్రతి పనికి సేకరించాల్సిన ఆస్తులు తదితర సమగ్ర నివేదికను అందజేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.