కుత్బుల్లాపూర్, జూలై 8: పది నిమిషాలు దాటితే వాళ్లు బుక్కు చేసుకున్న హోటల్ చేరుకొని ప్రాణాలు కాపాడుకునే వాళ్లేమో.. అంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని అగ్నికి ఆహుతులయ్యారు. ఇద్దరు సాఫ్ట్వేర్ దంపతులతో పాటు తమ పిల్లలకు పూర్తిగా బూడిదయ్యారు. బాధిత కుటుంబానికి కేవలం వారి దంతాలు, ఎముకలు మాత్రమే మిగిల్చి ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈనెల 6న రాత్రి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంతో నగరంలోని కొంపల్లి, అల్వాల్ ప్రాంతాల్లో ఉన్న బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నారు.
కొంపల్లిలోని ఎన్సీఎల్ నార్త్ కాలనీకి చెందిన రవి-అనిత దంపతులకు కుమార్తె తేజస్విని కుమారుడు ఆకాష్ ఉన్నాడు. ఆకాష్ కూడా అమెరికాలోనే ఉంటాడు. అల్వాల్లో జూపిటర్ కాలనీకి చెందిన పశుపతినాథ్-గిరిజ దంపతులకు కుమారుడు శ్రీవెంకట్, కుమార్తె దీపిక ఉన్నారు. శ్రీవెంకట్కు కొంపెల్లిలోని నార్త్ ఎన్సీఎల్ రవి అనిత దంపతుల కుమార్తె తేజస్వినితో 2012లో పెండ్లి అయ్యింది. వీరికి కొడుకు సిద్ధార్థ(9) నాలుగో తరగి చదువుతుండగా.. కూతురు మృద(7) రెండో క్లాస్ చదువుతున్నది. శ్రీవెంకట్-తేజస్విని అమెరికా డల్లాస్లో ఏడాది కిందట ఇల్లు కొనుక్కొని అక్కడే నివాసం ఉంటున్నారు.
శ్రీవెంకట్ అక్క దీపిక అట్లాంటాలో ఉంటుంది. తేజస్విని చిన్నాన్న నాగరాజు కూడా అట్లాంటలోనే ఉంటాడు. ఇరువురి కుటుంబాల ఇండ్లు పక్కపక్కనే ఉంటాయి. వారం రోజులపాటు సెలవులను ఆనందంగా గడిపేందుకు వెళ్లారు. గతంలో రెండు మూడుసార్లు కారులోనే వచ్చి పోయారు. ఇదే క్రమంలో తిరుగు ప్రయాణంలో ఈనెల 6వ తేదీన రాత్రి శ్రీవెంకట్ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కారులో తాము ఉండే డల్లాస్కు బయలుదేరారు. మార్గమధ్యలోని గ్రీన్ కౌంటీ వద్ద శనివారం అర్ధరాత్రి ఓ మినీ ట్రక్కు ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగడంతో వీరంతా కారులో సజీవ దహనమయ్యారు.
కాగా, కారును ఢీకొట్టిన ట్రక్కు రాంగ్రూటులో రావడంతోపాటు అప్పటికే రాంగ్రూట్లో వస్తున్న ట్రక్కుపై అక్కడి పోలీసులకు స్థానికుల నుంచి 10 ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. కారు పూర్తిగా కాలిపోవడంతో మృతుల ఎముకలను, దంతాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించి, డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. పది నిమిషాల్లో అయితే వాళ్లు బుక్ చేసుకున్న హోటల్కు చేరుకునేవారు. ఇంతలోనే ప్రమాదం జరిగింది. ఆ కుటుంబాలను తీవ్ర విషాదానికి గురిచేసింది. 24 గంటల్లో తల్లిదండ్రులకు దంతాలు, ఎముకలను అమెరికా పోలీసులు ఇవ్వనున్నట్లు బాధిత బంధువులు తెలిపారు. కాగా, శ్రీవెంకట్ తల్లిదండ్రులు తన సోదరి వద్ద ఉండటంతో కారులో ప్రయాణిస్తే 12 గంటలు అవుతుందని, ఆ రాత్రి అక్కడే పడుకుని తెల్లారి ఫ్లైట్లో వస్తామని చెప్పడంతో శ్రీవెంకట్ తన భార్య పిల్లలతో కారులో వచ్చి దుర్మరణం పాలయ్యారు.