లాక్డౌన్లో ఓ స్నేహితుడికి ఎదురైన పరిస్థితి.. ఓ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టేలా చేసింది… కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు జరపడానికి ఇక ఎవరూ ఇబ్బంది పడకూడదనుకుని 10 మంది టెకీలు ఒక్కటైయ్యారు.. ఇందుకు ఓ ప్రణాళికను రూపొందించుకుని.. ‘లాస్ట్ రైడ్’ సేవలు ప్రారంభించారు.. కరోనాతో మృతి చెందిన వారికి కుటుంబం తోడు రాకపోయినా, బంధువులు వెంట రాకున్నా, స్నేహితులు హాజరుకాకపోయినా… ఈ 10 మంది మాత్రం మేం ఉన్నామంటూ ముందుకు వచ్చారు.. కరోనాతో మృతి చెందిన వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలను నిర్వహిస్తూ.. అందరికీ ఆప్తులుగా మారుతున్నారు.
కూకట్పల్లి ప్రాంతానికి చెందిన సాయితేజ సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతని స్నేహితుడికి గత ఏడాది మార్చిలో కరోనా సోకింది. అతను క్వారంటైన్లో ఉన్నప్పుడే అతని తల్లి కరోనాతో మృతి చెందింది. అంత్యక్రియలకు బంధువులు ఎవరూ కూడా ముందుకు రాకపోవడంతో.. స్నేహితుడు సాయితేజను సంప్రదించాడు. దీంతో సాయితేజ .. అతడి మిత్రులు అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. మొదట ఇంటి నుంచి ఆమెను శ్మశాన వాటికకు తరలించేందుకు ఓ అంబులెన్స్ను అడిగారు. అతను 9 కి.మీ దూరానికి రూ.25 వేలు అడిగాడు… చివరికి రూ.20వేలకు మాట్లాడుకుని మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ అంత్యక్రియలకు రూ.25వేలు అడిగారు. చివరికి రూ.20వేలు ఇచ్చి అంత్యక్రియలను పూర్తి చేశారు. ఇదంతా చూసిన సాయితేజకు ఒక మధ్య తరగతివారి పరిస్థితి ఇలా ఉంటే.. ఇక సామాన్యుడు కరోనాతో చనిపోతే, అతని ఇంట్లో ఎవరైనా మృతి చెందితే ఈ ఖర్చుల పరిస్థితి ఏంటని ఆలోచన వచ్చింది. అప్పుడు పుట్టిన ఆలోచనను ఆచరణలో పెట్టగా స్నేహితులతో కలిసి గత జూలై 4న ‘లాస్ట్ రైడ్’ను ప్రారంభించారు.
ఈ విధంగా ప్రారంభమైన ‘లాస్ట్ రైడ్’కు సాయితేజ నేతృత్వానికి మరో 9 మంది చేరారు. ముందు ఓ అంబులెన్స్ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఓ చిన్న కాల్సెంటర్ను ఏర్పాటు చేశారు. మానవత వాదులు అం దిం చిన సాయంతో ఓ డ్రైవర్ను కూడా పెట్టుకున్నారు. కాల్ సెంటర్ నంబర్ 7995404040ను అందుబాటులోకి తెచ్చారు. అదే విధంగా కొవిడ్ కంట్రోల్ను నిర్వహిస్తు న్న రాచకొండ, సైబరాబాద్ పోలీసులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కరోనాతో మరణించినవారి మృతదేహాలు తర లించడానికి కాల్సెంటర్కు లేదా సైబరాబాద్ కొవిడ్ కంట్రోల్(9490617440) , రాచకొండ కొవిడ్ కంట్రోల్ (9490617234)కు ఫోన్ చేస్తే చాలు ‘లాస్ట్ రైడ్’ సేవలు అం దుతాయి. కరోనా భయంతో చాలా మంది తమ కుటుంబ స భ్యులు మరణించినా ముట్టుకోవడానికి వణికిపోతున్నారు. ఇలాంటి సమయంలో చాలా మంది ‘లాస్ట్ రైడ్’ కు ఫోన్చేసి వారి సేవలను కోరుతున్నారు. కరోనా మృతదేహాలను అంబులెన్స్ డ్రైవర్తో పాటు సాయితేజ బృందం బన్సీలాల్పేట, అంబర్పేట, ఈఎస్ఐ వద్ద ఉన్న శ్మశాన వాటికలకు తరలించి వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. గత ఏడాదిలో ‘లాస్ట్ రైడ్’ ద్వారా 210 మందికి అంత్యక్రియలను నిర్వహించారు. అందులో 160 మంది కరోనాతో దవాఖానలో మరణించిన వారు ఉండగా.. మరో 50 మంది ఇండ్లలో మరణించిన వా రు ఉన్నారు. ఇలా ఉచితంగా సేవలను అందిస్తున్న ‘లాస్ట్ రైడ్’ ఇ ప్పుడు చాలా మంది కి ఉపయోగంగా మారింది.
సాయితేజ, శ్రీనివాస్ బెల్లం, ప్రదీప్, ప్రశాంత్, వినయ్, రమణ్జీత్ సింగ్, ప్రదీప్, సురేంద్ర, మరో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. అటు ఉద్యోగం చేస్తూనే.. ఇటు సామాజిక సేవ చేస్తున్నారు. ఈ 10 మందిలో రోజుకు ఒకరు కాల్ సెంటర్లో విధులు నిర్వహిస్తుంటారు.. మిగతావారు సేవలో ఉంటారు.. ప్రస్తుతం రెండు అంబులెన్స్లు ఉండగా ఒక అంబులెన్స్తోనే సేవలను కొనసాగిస్తున్నారు. ఒక్కో రోజు 3 నుంచి 5 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. విదేశాల్లో ఉన్నవారికి.. వారి కుటుంబ సభ్యుల అంత్యక్రియల వీడియోలను తీసి పంపిస్తున్నారు. డబ్బులు ఇచ్చే స్తోమత ఉన్నవారు ఇస్తే కొంచం తీసుకుంటారు.. లేనివారికి పూర్తిగా ఉచితమే. అంబులెన్స్ డ్రైవర్కు నెలకు రూ. 25 వేల జీతం చెల్లిస్తూ.. అతడి కుటుంబానికి ఇన్సూరెన్స్ను కూడా చేయించారు. ఇలా సేవ చేస్తూ ముందుకుసాగుతున్నారు..
నా స్నేహితుడికి ఎదురైన పరిస్థితి సామాన్యులకు వస్తే ఎలా అనే ఆలోచన వచ్చిం ది. ఆ ఆలోచనను స్నేహితులకు చెప్పగా వారు ముందుకు వచ్చారు. దీంతో 10 మంది స్నేహితులం కలిసి ‘లాస్ట్ రైడ్’ను ప్రారంభించాం.. కరోనాతో మృతి చెందినవారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం.. పేదలకు సేవచేయడం చాలా సంతోషంగా ఉంది. మనిషి జీవితానికి చివరి కార్యక్రమం అంత్యక్రియలే. అలాంటి వాటిని గౌరవప్రదంగా నిర్వహించలేక పోతున్నామని బాధపడేవారికి తోడుగా ఉండటం ఆనందంగా ఉంది. ఇందుకు మా కుటుంబ సభ్యుల కూడా మద్దతు ఉంది. దీంతో రెండో దశ కరోనా విజృంభణలో కూడా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాం. మా సేవలను చూసి చాలా మంది దాతలు పీపీఈ కిట్లు అందిస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ పోలీసులు కూడా మా సేవలను గుర్తించి మమ్మల్ని ప్రశంసిస్తుండటం ఆనందానికి గురి చేస్తుంది. – సాయి తేజ, లాస్ట్ రైడ్ నిర్వాహకుడు